కొత్తూరు రూరల్ : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ విష్ణువర్ధన్రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం, తుర్కలపల్లి గ్రామానికి చెందిన జోగు అంజయ్యగౌడ్ (50) గత 25 ఏండ్ల క్రితం తన భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో కొత్తూరు మండల పరిధిలోని కొడిచర్ల గ్రామానికి చెందిన అనసూయను వివాహం చేసుకున్నాడు. అంజయ్యగౌడ్ కొడిచర్ల గ్రామంలో నివాసం ఉంటూ కొత్తూరు మండల కేంద్రంలోని బాలాజీ హోటల్లో సర్వర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా మద్యానికి బానిస కావడంతో భార్య అనసూయ ఎన్నోసార్లు మందలించింది.
ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూనే వచ్చాయి. శనివారం తీవ్ర మనస్థాపానికి గురైన అంజయ్యగౌడ్ కొడిచర్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన జహంగీర్ పంట పొలంలో మృతిచెంది పడి ఉన్న అంజయ్యను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఏఎస్ఐ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు.