బొంరాస్పేట : చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతిచెందిన సంఘటన బొంరాస్పేట మండలంలోని కొత్తూరులో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటనారాయణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగెం చిన్న వెంకటయ్య (52) శనివారం తెల్లవారుజామున గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులో చేపలు పట్టడానికి దిగాడు. వల వేస్తున్న క్రమంలో కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. ఉదయం ఎనిమిదైనా వెంకటయ్య ఇంటికి రాకపోయేసరికి భార్య విజ్జమ్మ, కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూడగా కట్టపై బట్టలు కనిపించాయి.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువులో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. భార్య విజ్జమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటనారాయణ తెలిపారు.