ఇబ్రహీంపట్నంరూరల్ : చేపల వేటకు వెల్లి ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతిచెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామానికి చెందిన షేక్ రహీం(53) గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్మశాన వాటికకు నీళ్లు కొట్టే పని చేస్తుండేవాడు. ప్రతిరోజు మాదిరిగానే ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటలకు నీళ్లు కొట్టి వస్తానని చెప్పి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో మృతుడి కుటుంబీకులు ఆదివారం ఉదయం 10గంటలకు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెంటనే గాలింపు జరుపడటంతో పెద్ద చెరువులో పడి చనిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనే సంఘటన స్థలానికి వెల్లి పరిశీలించగా మృతుడు చేపల వేటకు వెల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి ముళ్లకంపలో ఇరుక్కుని ఊపిరి ఆడక మృతిచెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.