నేటి ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. ఉమ్మడి జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు మూడు కేంద్రాలు, వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఓట్ల కౌంటింగ్ కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఇటు అభ్యర్థులు, అటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.
ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేయగా.. 400 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గాల కోసం అదనపు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి.. 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలను చేపడుతున్నది. మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది.
-రంగారెడ్డి, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 209 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 21,11,204 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నేడు తేల్చనున్నారు. మూడు ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గంలో 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేస్తుండగా.. 400 కంటే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గంలో అదనంగా టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానున్నది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి.. 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 10 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. 900 మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ విధులను నిర్వర్తిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలను చేపడుతున్నది.
జిల్లాలోని 8 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 290 మంది సూపర్ వైజర్లు, 331 మంది అసిస్టెంట్స్, 279 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఓ సూపర్ వైజర్, ఇద్దరు సహాయకులు, ఓ మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అభ్యర్థుల వెంట ఓ ఏజెంటు ఉంటారు. లెక్కించిన ఓట్ల వివరాలను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్వో), కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు సరి చూస్తారు.
కరెక్టుగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాక ఆ రౌండ్ ఫలితాన్ని ప్రకటిస్తారు. జిల్లాలో మొత్తం 3,453 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న షాద్నగర్, కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాల ఫలితాలు 18 నుంచి 23 రౌండ్లలోనే వెనువెంటనే త్వరగా వెలువడనున్నాయి. ఈసారి ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెచ్చినందున ఫలితాలు వేగంగా వెల్లడయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల కౌంటింగ్ను ఇబ్రహీంపట్నం పరిధిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, ఎల్బీనగర్ ఓట్ల లెక్కింపును సరూర్నగర్ ఇండోర్ స్టేడియం, శేరిలింగంపల్లి ఓట్లను గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, రాజేంద్రనగర్, షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాల ఓట్లను అప్పా జంక్షన్ సమీపంలోని లార్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో చేపట్టనున్నారు.
కౌంటింగ్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించారు. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసి వేయాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రెండు పర్యాయాలకు పైగానే గెలిచిన వారు ఉన్నారు. ఆది నుంచీ జిల్లా ప్రజానీకం గులాబీ పార్టీ వెన్నంటే ఉంది. అసెంబ్లీ ఎన్నికలే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్కే పట్టం గడుతూ వచ్చారు. ఈసారి కూడా తమదే విజయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పైకి రకరకాలుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజానీకం సంతోషంగా ఉన్నదని, ఆ కారణంగానే అన్నివర్గాల మెజార్టీ ఓట్లు తమకే పడుతాయన్న విశ్వాసాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అద్వితీయ మెజార్టీతో విజయం సాధించిందని, ఈసారి కూడా గెలిచి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారన్న ధీమాతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు.