రంగారెడ్డి, జూలై 31 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకుంది. ఈసారి పంటల సాగు విస్తీర్ణం 3.90 లక్షల ఎకరాలు కాగా.. 4.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తున్నది. ఇప్పటికే 1.78 లక్షల ఎకరాల్లో పంటల సాగు పూర్తయింది. ప్రస్తుత వానకాలంలో అధిక శాతం రైతులు పత్తి సాగువైపే మొగ్గు చూపుతున్నారు. నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో వరి పంటను రైతులు సాగు చేసుకుంటుండగా.. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పత్తిని సాగు చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో వరిని మించి ఈసారి పత్తి సాగవుతున్నది. 1.99 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందన్న అంచనాల మేరకు ఇప్పటికే 1.12 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా దళారుల బెడద లేకుండా పత్తిని కొనుగోలు చేస్తుండడం.. మద్దతు ధర లభిస్తుండడం వంటి అనుకూల పరిస్థితుల నేపథ్యంలో పత్తి సాగు వైపు రైతాంగం అడుగులు వేస్తున్నది.
ప్రధాన పంటగా పత్తి సాగు
రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత వానకాలంలో ప్రధాన పంటగా రైతాంగం పత్తి పంటను సాగు చేస్తున్నది. గత కొన్నేండ్లుగా పత్తికి మంచి ధర పలికిన నేపథ్యంలో ప్రభుత్వం వానకాలం సీజన్లో పత్తి పంటనే సాగు చేయాలని రైతులకు సూచించింది. ఈ మేరకు అధికారులు రైతులను చైతన్యపర్చడంతో పత్తివైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. నీటి అవసరం అంతగా లేకపోవడం.. లాభాలు బాగుండడంతో రైతులు నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పత్తి సాగుపైనే దృష్టిసారిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నేలలు పత్తి సాగుకే అనుకూలంగా ఉండడం వంటి కారణాల నేపథ్యంలో చాలామంది రైతులు పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు లక్ష్యంలో సింహభాగం మేర పత్తి పంట సాగు పూర్తయ్యింది. అక్కడక్కడా మొలకెత్తిన పంటలో ఇప్పటికే కలుపు సైతం తీస్తున్నారు. విత్తనం మొలకెత్తని చోట రైతులు మరోసారి విత్తనాలు నాటుకుంటున్నారు.
తోడ్పాటునందిస్తున్న ప్రభుత్వ చర్యలు
పత్తి సాగు పెరగడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సైతం తోడ్పాటునందిస్తున్నాయి. నకిలీ విత్తన విక్రయాలపై ప్రభుత్వం కొరడా ఝులిపించడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. పత్తికి మద్దతు ధర ప్రకటించడం కూడా రైతుల పాలిట వరంగా మారింది. సాగు ఖర్చు పెరిగినప్పటికీ దిగుబడులు పెరగడం, ధర సైతం ఆశాజనకంగా ఉండడంతో రైతులు పత్తివైపే మొగ్గు చూపుతున్నారు. గతంలో జిల్లాలో కందులు, మొక్కజొన్న వంటి పంటలను రైతులు ఎక్కువగా సాగు చేసేవారు. రెండేండ్లుగా ఆయా పంటల సాగు గణనీయంగా తగ్గింది. ఆ పంటల స్థానంలో రైతులు పత్తిని సాగు చేస్తూ వస్తున్నారు. వరి పంట ఈసారి 87వేల ఎకరాలకే పరిమితమైంది.
డివిజన్లవారీగా ఇప్పటివరకు సాగైన పత్తి పంట వివరాలు
డివిజన్ : సాగైన పత్తి(ఎకరాల్లో)
చేవెళ్ల : 21,770
ఇబ్రహీంపట్నం : 48,927
మహేశ్వరం : 9,880
రాజేంద్రనగర్ : 55
షాద్నగర్ : 31,629