రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
ఆమనగల్లులో పర్యటన
ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన
32 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్ల పంపిణీ
కడ్తాల్, జూన్ 14: సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నదని.. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నా రు. మంగళవారం ఆమె ఆమనగల్లు పట్టణంలో రూ.2 కోట్లతో చేపట్టనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనతోపాటు, దళితబంధు పథకం కింద ఎంపికైన ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, మరో 30 మందికి చెక్కులను ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వాణీదేవి, గోరటి వెంకన్న, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి అందజేశారు.
అనంతరం జైపాల్యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం సర్కారు బడుల్లో మౌలిక వసతులను కల్పించేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నా రు. కానున్న మూడేండ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల ను కల్పించి ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతామన్నా రు. ఈ విద్యాసంవత్సరం నుంచే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అమల్లోకి వచ్చిందన్నారు. గురుకుల పాఠశాలల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వేరే చోట్ల నిర్వహిస్తున్న గురుకులాలను సొంత ప్రాం తాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని, ఈ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందు కు గడ్డిఅన్నారంలో రూ.1200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నదని మంత్రి తెలిపారు. వైద్యారోగ్య శాఖలో 12 వేలు, విద్యాశాఖలో 20 వేలు, పోలీసు శాఖలో 20 వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తున్నదన్నారు.
దేశానికే ఆదర్శం దళితబంధు పథకం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియో గం చేసుకుని ఆర్థికంగా ఎదుగాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల సీఎంలు ఆదర్శంగా తీసుకుంటున్నారని వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కానున్నాయన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలతో రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మారిందన్నారు. అనంతరం రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నదన్నారు. ఆమనగల్లు, కడ్తాల్ మండలాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలన్నారు. అంతకుముందు మంత్రి, ఎం పీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లకు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికి, శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీలు అనిత, కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీలు అనురాధ, దశరథ్నాయక్, విజితారెడ్డి, నాగర్కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ గిరియాదవ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్కుమార్, ఎంపీడీవోలు వెంకటరాములు, రామకృష్ణ, రాఘవులు, ఫారూఖ్హుస్సేన్, తహసీల్దార్ పాండూనాయక్, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, నాయకు లు శ్రీనివాస్రెడ్డి, అర్జున్రావు, నారాయణ, పరమేశ్, రాధమ్మ, సోని, లక్ష్మీనర్సింహారెడ్డి, గోదాదేవీసత్యం, , కుమార్, లచ్చిరాంనాయక్, సరిత, జైపాల్రెడ్డి, రవి, పవన్కుమార్రెడ్డి, కృష్ణారెడ్డి, లాలయ్య, రాములు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల అమల్లో…
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎంపీ రాములు అన్నారు. ‘మన ఊరు-మన బడి’తో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రూ. 4.78 కోట్లతో కందుకూరు నుంచి డిండి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిని నాలుగు లైన్లుగా మార్చాలని కేంద్ర మంత్రి నితిన్గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేయగా, ఆయన సానుకూలంగా స్పందించి రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధింత అధికారులకు ఆదేశాలిచ్చారని ఎంపీ వివరించారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. ‘మన ఊరు-మన బడి’ కింద మౌలిక వసతుల కల్పనకు నియోజకవర్గంలోని 108 ప్రభుత్వ స్కూళ్లు ఎంపికైనట్లు తెలిపారు. పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియ ర్ కళాశాల భవనానికి మరో రూ.3 కోట్ల నిధులను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ను కోరినట్లు చెప్పారు. ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి త్వరలోనే రూ.15 కోట్లు మంజూరు కానున్నట్లు, కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.
కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది..
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ఒక్క మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేయకుండా వివక్ష చూపుతున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఆమనగల్లు ప్రాంతంలో మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలని మంత్రిని ఆయన కోరారు. ‘మన ఊరు-మన బడి’ తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారుతాయన్నారు.