కొడంగల్, నవంబర్ 13 : ఢిల్లీ నాయత్వం వద్దు.. గల్లీ నాయకత్వమే కావాలని, 2014కు ముందు మైనార్టీలను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని రాష్ట్ర హోం శాఖామాత్యులు మహమూద్అలీ తెలిపారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో మైనార్టీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్తోనే మైనార్టీల అభ్యున్నతి సాధ్యపడుతుందని, గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మైనార్టీలను పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే మైనార్టీల మనుగడ ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకులా మాత్రమే వాడుకుందన్నారు. రేవంత్రెడ్డివి ఉట్టి మాటలే తప్ప.. చేతలు చేతకావని.. అబద్దపు మాటలను నమ్మవద్దన్నారు. అవకాశవాది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మతాల చిచ్చు పెట్టి అధికారాన్ని చలాయించిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉందని ప్రజలు తెలుసుకోవాలన్నారు. నేడు సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి తలమానికంగా మారిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముస్లింలను ఎంతగానో ఆదరిస్తున్నదని.. గతంలో డిప్యూటీ సీఎంగా, ప్రస్తుతం హోం మంత్రిగా అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు.
మసీదుల్లో ఉండే మౌజం, ఇమాంలకు ప్రతి నెలా రూ.5వేల గౌరవ వేతనాన్ని అందిస్తున్నదని, ఇప్పటివరకు రూ.304 కోట్లు ఇమాం, మౌజంల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఇమాం, మౌజంలకు రూ.10వేలకు పెంచే హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 4 మైనార్టీ పాఠశాలలను ఏర్పాటు చేసి లక్షా40వేల మంది విద్యార్థులకు రూ.3,300 కోట్లు ఖర్చు చేసిందన్నారు. నేడు కార్పొరేట్ తరహాలో ముస్లిం చిన్నారులు విద్యను అందుకుంటున్నట్లు తెలిపారు. 2,520 మంది విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. షాదీముబారక్ కింద ఇప్పటివరకు 268 మందికి రూ.2.32 కోట్లు అందజేసినట్లు తెలిపారు. నేడు మరో గాంధీగా కేసీఆర్ను ప్రజలు ఆదరిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో రైతు బంధు రూ.16వేలకు, సౌభాగ్యలక్ష్మి పథకంతో ప్రతి మహిళకు రూ.3వేలు, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు రూ.5లక్షల బీమా, రూ.400లకే గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో అద్భుతమైన పథకాలున్నాయన్నారు. మైనార్టీలు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో పెద్దమొత్తంలో మైనార్టీల అభ్యున్నతికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించే హామీని సీఎం ఇచ్చినట్లు తెలిపారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సాధిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలపాలని, కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా నిలబెట్టుకొని తెలంగాణకు బంగారు బాటలు వేసుకుందామని ఆయన పేర్కొన్నారు.
మైనార్టీల అభ్యున్నతి కేసీఆర్తోనే సాధ్యం
మైనార్టీల అభ్యున్నతి సీఎం కేసీఆర్తోనే సాధ్యపడుతుందని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. కోట్లాది నిధులతో మసీదులు, ఈద్గాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ముస్లింల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంతో ముస్లింలు విద్యాపరంగా, ఆర్థికంగా, అభివృద్ధిపరంగా సౌకర్యాలను అందుకుంటున్నారని, రూ.36 కోట్లతో మైనార్టీ పాఠశాలలను ఏర్పాటైనట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 6 గ్యారెంటీల హామీ ఇస్తున్నదని, కాంగ్రెస్కే గ్యారెంటీ లేదు కానీ 6 గ్యారెంటీలు అని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు. గతంలో ఈ గ్యారెంటీలు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఎంత ఇస్తే.. తాను అంతకంటే రెట్టింపు ఇస్తానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకోవాలని రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
మైనార్టీలకు రూ.13 కోట్లు మంజూరు
నియోజకవర్గ పరిధిలో మైనార్టీలకు రూ.13 కోట్లతో అభివృద్ధి పనులు చేయించినట్లు ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్రెడ్డి తెలిపారు. మైనార్టీ రెసిడెన్షియల్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసి ఉత్తమ విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గతంలో ఇటువంటి ప్రోత్సాహం లేక చదువుకు దూరంగా ఉండి వెట్టిచారికీ పనులతో కాలం గడిపేవారని, నేడు ఉన్నత విద్యలో రాణించి సమాజంలో ఉన్నత స్థానంలో నిలుస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో మసీదుల పునరుద్ధరణ, ఈద్గాల నిర్మాణం వంటి పనులు జరిగినట్లు తెలిపారు. రూ.150 కోట్ల మైనార్టీ లోన్స్, కోస్గిలో 5 ఎకరాల్లో వైకుంఠధామం స్థలం, రూ.10లక్షలతో కాంపౌండ్వాల్, ఈద్గా వంటి వాటికి రూ.15లక్షలు, మైనార్టీ గురుకుల భవన నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, రాష్ట్ర ఫైనాన్స్ డైరెక్టర్ ఎండీ సలీం, ఎన్నికల ఇన్చార్జి కృష్ణారావు, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇంతియాజ్, ఈజీఎస్ స్టేట్ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, బీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ నాయకులున్నారు.