మాతాశిశుల ఆరోగ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించి కాన్పుల సంఖ్యనూ పెంచింది. మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడ బిడ్డ జన్మిస్తే రూ.13 వేలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నది. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు అమలు చేసిన కేసీఆర్ కిట్ పథకం.. మహిళల ఆదరాభిమానాన్ని చూరగొన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అంతా గోల్మాల్ అయ్యింది. కేసీఆర్ కిట్ను ఎంసీహెచ్గా మార్చి నిధుల కొరతంటూ సరఫరాను తగ్గించింది. సర్కారు దవాఖానల్లో కాన్పులు చేయించుకున్న వారికి ఎంసీహెచ్ కిట్లు అందక లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ తగ్గుతుండడం బాధాకరం.
రంగారెడ్డి, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : బాలింతలకు అండగా నిలిచే ఎంసీహెచ్ కిట్ల పథకానికి నిధుల కొరత వేధిస్తున్నది. గతంలో కేసీఆర్ కిట్ పేరుతో ఉన్న ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంసీహెచ్ కిట్గా పేరు మార్చింది. గత ప్రభుత్వంలో ఈ పథకం మహిళల నుంచి అనూహ్య ఆదరణ పొందింది. అయి తే కొంతకాలంగా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం నిలిచిపోవడంతో లబ్ధిదారులు పరేషాన్ అవుతున్నారు. అక్కడక్కడా కిట్ల కొరత సైతం ఉండడంతో ఆశించిన స్థాయిలో లబ్ధిదారులకు పంపిణీ కావడంలేదు. తాజాగా నెలకొన్న పరిస్థితులతో ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గే అవ కాశాలున్నాయి. ఈ ప్రభావం మాతా, శిశు మరణాలపైనా చూపనున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేసింది. ప్రసవం తర్వాత మగబిడ్డ పుడితే తల్లికి రూ.12వేలు, ఆడ బిడ్డ జన్మిస్తే అదనంగా వెయ్యి తో కలిపి రూ.13 వేలను రెండు దఫాలుగా గత ప్రభుత్వం అందజేసింది. వీటి తోపాటు తల్లీబిడ్డల కోసం డ్రెస్సులు, చీరలు, బేబీ నూనె, బేబీ పౌడర్, టవల్, షాంపూ వంటి 18 రకాల వస్తువులతో కూడిన కిట్ను అందజేసేవారు.
ఈ కిట్కు మంచి డిమాండ్ ఉన్నది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ నాటికి మొత్తం 26,702 డెలివరీలు కాగా.. అందులో 62 శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయి. అయితే ప్రోత్సాహకంగా అందించాల్సిన నగదుకు కొన్నాళ్లుగా బ్రేక్ పడింది. అలాగే కిట్ల కొరతతో ఆశించిన మేర అందడం లేదని సమాచారం. దవాఖానల్లోని వైద్యులను అడిగితే కిట్లు రాలేదని అంటున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు.
గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగిన వారిలో సుమారు 11వేల మందికిపైగా ఎంసీహెచ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారికి ప్రోత్సాహకంగా సుమారు రూ.20కోట్లకు పైగా నగదు అందాల్సి ఉన్నది. లబ్ధ్దిదారులు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసినా నగదు జమ కాకపోవడంతో ప్రోత్సాహక డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకం పేరు మార్పుపై చూపిన శ్రద్ధ కిట్ల పంపిణీ, నగదు అందజేతపై చూపడంలేదనే విమర్శలున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాన్పులు అయిన వెంటనే కేసీఆర్ కిట్లను అందించేవారు. కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రోత్సాహక నగదు కోసం సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించినా ఎలాంటి స్పందన లేదు. దీంతో లబ్ధిదారులకు సమాధానం చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని కొంతమంది వైద్యులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య తగ్గి మాతా,శిశు మరణాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వారంటున్నారు.
గర్భిణులకు అందించే న్యూట్రిషన్ కిట్ల పంపిణీలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. గర్భిణులను పోషకాహార లోపం, రక్తహీనత నుంచి కాపాడేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ కిట్లో రూ.2 వేల విలువజేసే కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూరం, మూడు ఐరన్ సిరప్ బాటిళ్లు, అరకిలో నెయ్యి, 200గ్రాముల పల్లీపట్టి, ఒక కప్పు, ప్లాస్టిక్ బాటిల్ ఉంటాయి. అయితే ప్రస్తుతం కిట్ల కొరత ఏర్పడడంతో పంపిణీ నిలిచిపోయింది. గతేడాది డిసెంబర్ నాటికి జిల్లాలో 45,763 మంది గర్భిణులను గుర్తించి 11,059 మందికి న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ పంపిణీని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా..? లేక రద్దు చేస్తుందా..? అన్నదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు.