అబ్దుల్లాపూర్మెట్, మార్చి 8 : మండలంలోని గువ్వలేటి-అనంతారం మార్గంలోని మూసీవాగుపై వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. రంగారెడ్డి-యాదాద్రి భువనగిరి రెండు జిల్లాల సరిహద్దు రహదారి.. గువ్వలేటి-అనంతారం మూసీవాగుపై రాకపోకలు సాగించడానికి కొన్నేండ్ల నుంచి గగనంగా ఉండేది. వర్షాకాలం వస్తే చాలు ఈ రహదారిపై ప్రయాణం నరకమే. వరదొస్తే వాహనదారులు, పరిసర గ్రామాల రైతులు పలుమార్లు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. వారం నుంచి నెలల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. దీంతో ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టాలని అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో మూసీవాగుపై వంతెన నిర్మాణానికి మోక్షం లభించింది. ప్రజల కష్టాలను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అధికారులు వంతెన నిర్మాణానికి అంచనా వ్యయ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో నిధులు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టింది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం చిన్నరావిరాల గ్రామ పంచాయతీ పరిధిలోని గువ్వలేటి-అనంతారం మార్గంలోని మూసీ వాగుపై వంతెన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.6 కోట్ల 55 లక్షల నిధులు మంజూరు చేసింది. దాంతో 2014లో హైలెవల్ వంతెన నిర్మాణానికి అప్పటి రోడ్డు రవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, మలిపెద్ది సుధీర్రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి కావడంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.
వంతెన నిర్మాణం పూర్తి కావడంతో వాహనదారుల రాకపోకలకు ప్రయాణ దూర భారం తగ్గింది. గతంలో వర్షాలు వచ్చి వాగు పొంగి పొర్లితే పరిసర గ్రామాల ప్రజలు, వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. అత్యవసరంగా ఘట్కేసర్, వరంగల్ జాతీయ రహదారి వైపు వెళ్లాలంటే అబ్దుల్లాపూర్మెట్, హయత్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ మీదుగా వెళ్లాల్సి వచ్చేది. దీంతో అదనంగా 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించడంతో పాటు సమయం వృథా అయ్యేది. గువ్వలేటి-అనంతారం మూసీవాగుపై వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడంతో వాహనదారులకు దూర భారం తగ్గింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రయాణికుల కల నెరవేరింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మూసీవాగుపై వంతెన నిర్మించాలని ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాకాలం వాగుపై వరదొస్తే పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం చేపట్టింది. దీంతో పరిసర గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగినాయి. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– చింతల రాంరెడ్డి, చిన్నరావిరాల
గువ్వలేటి-అనంతారం మూసీవాగుపై వంతెన నిర్మాణం శుభపరిణామం. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం స్పందించి రూ.6 కోట్ల 55 లక్షల నిధులు మంజూరు చేసి వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పనులు పూర్తి కావడంతో పరిసర గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– సురకంటి వనజాశ్రీనివాస్రెడ్డి, సర్పంచ్, చిన్నరావిరాల