రంగారెడ్డి, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు సమన్వయ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఫలితంగా.. బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు విజయవంతమవుతున్నాయి. కానీ.. కాంగ్రెస్, బీజేపీలది మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి. పార్టీలు మారిన నేతలు అభ్యర్థులుగా ఉండడంతో కిందిస్థాయిలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కొరవడిందని ప్రచారం జరుగుతున్నది. గ్రూపు రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు రెండు పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
బెంబేలెత్తుతున్న ప్రతిపక్షాలు..
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహ ప్రతి వ్యూహాలకు ప్రతి పక్ష పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులు పలు దఫాలుగా చేవెళ్ల లోక్సభ స్థానం గెలుపుపై జిల్లాకు చెందిన నేతలు సమీక్ష, సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి సబితారెడ్డి నాయకత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పకడ్బందీగా కార్యాచరణను రూపొందించుకుని అమలు చేస్తున్నారు. అన్ని స్థాయిల్లోని నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను కలుపుకొని ఇప్పటికే ఒక రౌండ్ సమావేశాలను పూర్తి చేశారు. చేవెళ్లలో నిర్వహించిన కేసీఆర్ సభ సైతం సూపర్ సక్సెస్ కావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నైరాశ్యంలో ఉన్న క్యాడర్ ప్రస్తుతం సమరోత్సాహంతో ఎన్నికల్లో దూసుకుపోతున్నది. ప్రతిపక్ష పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. గ్రూపులు, అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్గా మారిన ఆ రెండు పార్టీలపై ప్రజల్లో ఒకింత అసహనం వ్యక్తమవుతున్నది. అధికార పార్టీ ప్రలోభాలతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నప్పటికీ జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది. చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న భావన కనిపిస్తున్నది.
బీఆర్ఎస్ వెన్నంటే జనం..
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతున్నది. బీసీ నినాదం సైతం బీఆర్ఎస్కు కలిసి వస్తున్నది. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రతి సభ, సమావేశానికి ఊహకందని రీతిలో సబ్బండ వర్గాలు కదిలి వస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డిలపై స్థానిక ప్రజానీకం ఆగ్రహంగా ఉన్నది. హామీలను విస్మరించిన కాంగ్రెస్పైన, తెలంగాణ పట్ల వివక్ష చూపిన బీజేపీపై గుర్రుగా ఉన్న ప్రజానీకం కారుకే ఓటేస్తామని బహిరంగంగానే చెబుతున్నది.
జనం నుంచి వస్తున్న స్పందనను చూసి గులాబీ దళం కదనోత్సాహంతో ముందుకు సాగుతున్నది. బీఆర్ఎస్కు ప్రజల నుంచి లభిస్తున్న స్పందనను చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరేషాన్లో పడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం ఖాయమన్న ధీమాను వివిధ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.