యాచారంలో ఎంపీ వెంకట్రెడ్డి పర్యటనలో మరోసారి బయటపడిన తగాదాలు
యాచారం, జూలై 7: నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న గ్రూపు తగాదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చం దంగా కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు మండలంలోని గడ్డమల్లయ్యగూడలో బహిర్గతమయ్యాయి. ఎంపీ కోమటిరెడ్డి పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకులు మర్రి నిరంజన్రెడ్డి, కొత్త కుర్మ సత్తయ్య వారి అనుచరులు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో గ్రామానికి విచ్చేశారు. ఎంపీ వెంట వారంత ఎంతో హడావిడి చేశారు. అది అక్కడున్న నాయకులకు నచ్చలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి అనుచరులతో వాగ్వివాదానికి దిగా రు. ఇతర మండలాల నుంచి వచ్చి తమ మండలంలో హల్చల్ చేయడం ఏమిటని స్థానిక నేతలు ప్రశ్నించారు. వస్తే మీకేంటని, ఎంపీ వచ్చినందుకు వ చ్చామని వారు ఎదురు తిరగడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కొద్ది సేపు చిన్నపాటి తోపులాట చోటు చేసుకున్నది. పార్టీ సీనియర్ నాయకులు కల్పించుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మండలంలోని గడ్డమల్లయ్యగూడ గ్రామంలో గురువారం రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన వినాయకరెడ్డి అనే దాత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు గ్రామాభివృద్ధికి రూ.90 లక్షల సొంత ఖర్చులతో చేపట్టిన పనులను ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మౌలిక వసతులను కల్పించిన వినాయకరెడ్డిని దాతలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ జంగయ్య తదితరులున్నారు.