యాచారం, మే 30 : ఫార్మా బాధిత రైతులు శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్లో కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టగా.. అక్కడ ఒక ఫ్లెక్సీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిలు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫార్మాసిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని రైతులతో కలిసి పాదయాత్ర చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటు దుర్మార్గమని.. దానితో ప్రజలకు హాని జరుగుతుందని.. దానిని ఏర్పాటు చేయొద్దని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన భూములను తిరిగి అన్నదాతలకు అప్పగిస్తామని ప్రగల్బాలు పలికి ఓట్లు దండుకుని.. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పదవులు దక్కడంతో ప్రస్తుతం కనబడటంలేదు.. ఎక్కడ వెతికినా దొరకడంలేదని ఇందిరాపార్కు వద్ద వారి ఫొటోలతో కూడి న ఫ్లెక్సీని ఫార్మాసిటీ బాధిత రైతులు ఏర్పా టు చేశారు. ఆ దారిలో రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు, స్థానికులను ఎంతో ఆకట్టుకున్నది. ఈ ఫ్లెక్సీ కాంగ్రెస్ నాయకుల మోసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేసింది. అంతేకాకుండా ఆ ధర్నాలో రేవంత్ సర్కార్ మోసంపై రైతులు పాడిన పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి.