వరుణ్తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం భీమవరంలో ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని మీరందరూ ఆస్వాదిస్తారు. ‘తొలిప్రేమ’ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఇక్కడకు వచ్చాను. మళ్లీ 8 ఏళ్ల తర్వాత భీమవరంలో నా సినిమా ఫంక్షన్ జరగడం సంతోషంగా ఉంది.
ఈ సినిమాలో దర్శకుడు గాంధీ నన్ను కొత్త స్టైల్లో చూపించారు. తమన్ మ్యూజిక్తో సినిమాకు ప్రాణం పోశాడు. అభిమానులందరూ గర్వపడే సినిమా అవుతుందని నమ్మకంగా చెబుతున్నా. ఈ నెల 6వ తేదీ రాత్రి నుంచే ప్రీమియర్స్ వేస్తున్నాం’ అన్నారు. ఇలాంటి కథను ఎంచుకోవాలంటే దర్శకనిర్మాతలకు మంచి అభిరుచి ఉండాలని, కొరియా సంస్కృతిని అర్థం చేసుకోవాలని, తెలుగులో ఇదొక సరికొత్త ప్రయత్నమని సంగీత దర్శకుడు తమన్ చెప్పారు. ఈ సినిమాలో తాను పోషించిన చైత్ర పాత్ర హృదయానికి దగ్గరైందని కథానాయిక రితికా నాయక్ పేర్కొన్నది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.