రంగారెడ్డి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) ;ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం ‘చే’యిచ్చింది. మూడుసార్లు టెండర్లు పిలిచినా ఫలితం లేదు. అర్హత గల కంపెనీలు రాకపోవడంతో టెండర్లను ఖరారు చేయలేకపోయామని అధికారులు చెబుతున్నారు. ఇతర జిల్లాల్లో చేప పి ల్లల పంపిణీని చేపడుతున్న గుత్తేదార్లను రిక్వెస్ట్ చేసినా నో చెప్పడంతో ఈసారి పంపిణీకి రాంరాం పలికినట్లేనన్న టాక్ వినిపిస్తున్నది. అక్టోబర్ నెల ముగిసేందుకు వచ్చినా చేప పిల్లలను చెరువుల్లోకి వదలకపోవడంతో ఇప్పుడు వదిలినా.. లాభం లేదన్న అభిప్రాయం మత్స్యకారుల్లో వ్యక్తమవుతున్నది. జిల్లాలో చేపల వేటనే నమ్ముకుని 9,136 కుటుంబాలు జీవిస్తుండగా…ఈ ఏడాది తమకు జీవనోపాధి ఎట్లా అని మథనపడుతున్నారు. చేప పిల్లల పంపిణీకి సంబంధించిన నిధులను మత్స్య సహకార సొసైటీలో జమ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈ ఏడాది జీవనోపాధి ఎట్లా?..
జిల్లాలో 120 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 978 చెరువులు ఉన్నాయి. వీటి పరిధు ల్లో 186 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా..అందులో 9,136 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. కేసీఆర్ హయాంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేవారు. కానీ.. ఈసారి ఆ సందడి ఎక్క డా కనిపించడం లేదు. చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. ఇకనైనా పంపిణీ చేసే అవకాశం ఉన్నదా అంటే అధి కారుల నుంచీ స్పష్టత లేదు. గతంలో ప్రతిఏటా చేప పిల్లల పంపిణీని జూలైలోనే పూర్తి చేసేవారు. ఏవైనా అవాంతరాలు ఏర్పడితే ఆగస్టు మొదటి వారంలో పూర్తి అయ్యేది. ఇందుకోసం ప్రభుత్వం ఏప్రిల్ నుంచే సన్నాహాలు ప్రారంభించేది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో పెంచేందుకు 80 ఎంఎం నుంచి 100 ఎంఎం సైజు చేప పిల్లలను..అదేవిధంగా చెరువులు, కుంటల్లో పెంచేందుకు 35 ఎంఎం నుంచి 400 ఎంఎం సైజులో ఉండే పిల్లలను పంపిణీ చేసేది. అయితే ఈసారి ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. చేపల వేటనే జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకార కుటుంబాలు ఈ ఏడాది జీవనోపాధి ఎట్లా? అని ఆందోళన చెందుతున్నారు.
ఆసక్తి చూపక.. అర్హత కంపెనీలు రాక..
ఈ ఏడాది జిల్లాలోని 813 చెరువుల్లో కోటీ 93 లక్షల చేప పిల్లలను వదలాలని జిల్లా మత్స్యశాఖ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ మేరకు అధికారులు జూలై 10న టెండర్లు పిలిచినా ఒక్కరూ బిడ్ దాఖలు చేయలేదు. గడువును 23వ తేదీకి పెంచినా ఫలితం లేదు. దీంతో గడువును ఆగస్టు 13కు పెంచి రెండోసారి టెండర్లు పిలిచినా గుత్తేదార్ల నుంచి స్పందన రాలేదు. ముచ్చటగా మూడోసారి టెం డర్లు పిలిచిన ప్రభుత్వం బిడ్ దాఖలుకు ఈనెల 19వ తేదీకి గడువును పెంచింది. చివరగా పిలిచిన టెండర్లలో నల్లగొండ, కైకలూరు, మచిలీపట్నం ప్రాంతాలకు చెం దిన గుత్తేదార్లు టెండర్లలో పాల్గొన్నారు. అయితే చేప పిల్లలను సరఫరా చేసే సా మర్థ్యం ఆయా గుత్తేదార్లకు సంబంధించిన కంపెనీలకు లేని కారణంగా అధికారు లు డిస్ క్వాలిఫై చేశారు. జనగామలో చేప పిల్లల పంపిణీ కాంట్రాక్టును దక్కించుకున్న గుత్తేదారును రంగారెడ్డి జిల్లాలోనూ పంపిణీ చేయాల్సిందిగా అధికారులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సైతం పంపించారు. అయితే సదరు గుత్తేదారు ఆసక్తి చూపకపోవడంతో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వం మరో గుత్తేదారును సూచిస్తే..జిల్లాలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని అధికారులు చెబుతున్నారు.
కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులు..
మిషన్ కాకతీయ పథకంతో చెరువులను అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. అం దులో భాగంగానే మత్స్యకారులకు ఏడాది పొడవునా జీవనోపాధి కల్పించి ఆర్థిక భరోసా కల్పించేలా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసింది. 2016-17లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఏడేండ్లపాటు నిర్విఘ్నంగా కొనసాగించింది. గడిచిన ఏడేండ్లలో 6.63 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అందజేయ గా..అందుకోసం రూ.4.40 కోట్ల వరకు ఖర్చుచేసింది. ఈ మేరకు 41,753 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తితో రూ. 56.59 కోట్ల ఆదాయం ఒనగూరింది. జలాశయాల్లో ఉచితంగా వదిలిన బొచ్చ, రాహు, బంగారు తీగ, రొయ్య, ముల్లంగి తదితర చేపలతో మత్స్యకారులు ఏడాది పొడవునా ఉపాధిని పొందారు. ఈ ప్రాంతానికి చెందిన చేపలు ఇతర రాష్ర్టాలకూ ఎగుమతి అయ్యాయి. చేప పిల్లలను వేటాడేందుకు వలలు, రవాణా కోసం ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలు, బొలెరో వా హనాలను అందించింది. అలాగే మహిళా సహకార సంఘాలకు విరివిగా రుణాలను అందించడంతోపాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలను నిర్వహించి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకున్నది. గత ప్రభుత్వం కల్పించిన భరోసాతో మత్స్యకారుల జీవితాల్లో పెను మార్పులొచ్చాయి. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అటకెక్కడంతో కేసీఆర్ పాలనను మత్య్సకార కుటుంబాలు గుర్తు చేసుకుంటున్నాయి.