పూడూరు, ఫిబ్రవరి 16: భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్నది శ్రీ దామగుండ రామలింగేశ్వరాలయం. ఇక్కడ లింగేశ్వరుడిని శ్రీరాముడు సుమారు నాలుగు వందల ఏండ్ల క్రితం ప్రతిష్ఠించడంతో రామలింగేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిందని స్థానికులు చెబుతుంటారు. ఆలయ పరిసరాల్లో ఉన్న కోనేరులో స్నానం చేసి భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. ఈ ఆలయంలో ప్రతి ఏడాది జరిగే శివరాత్రి ఉత్సవాలకు గ్రామస్తులు, మండల, జిల్లా వాసులే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు అ ధికంగా తరలివస్తారు. పచ్చటి చెట్లు.. మూడు కొండల మధ్య కొలువైన ఈ ఆలయం భక్తులకు ప్రశాంతతతోపాటు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
ఈ ఆలయం పూడూరు మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఆలయం వద్ద ఉన్న కోనేరులో ప్రతి వేసవి కాలంలోనూ నీరు మాత్రం తగ్గదు. ఆలయ సమీపంలో ఇప్పటికీ నాడు మునులు ఏర్పాటు చేసుకున్న గుహలు కనిపిస్తాయి. ఈ గుహల్లో నుంచి పూడూరు గ్రామానికి దారి ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు.
ఆలయంలో అన్ని పండుగల సందర్భంగా ప్రత్యేక పూజలతోపాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. శ్రావణ, కార్త్తిక మాసాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. భక్తులు అధికంగా తరలివచ్చి ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తుంటారు. ప్రతి ఏడాది ఉగాది పండుగకు ముందు ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రి పండుగా సందర్భంగా ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తెలిపారు.