రంగారెడ్డి, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపునకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల పరిశీలనను యుద్ధప్రాతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో కలెక్టర్ శశాంక ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, నోడల్ ఆఫీసర్లతో పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా పక్కాగా రూపొందేలా అన్ని స్థాయిల్లో పకడ్బందీ పరిశీలన జరపాలన్నారు. ముఖ్యంగా 18-19 సంవత్సరాల వయసు వారు ఏ ఒకరూ మిస్ కాకుండా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలన్నారు.
2024 ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారి నుంచి సైతం దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించే క్రమంలో అదనపు సిబ్బంది సైతం అందుబాటులో ఉండేలా(రిజర్వ్) చర్యలు తీసుకోవాలని, 10 శాతం మేర అదనంగా సెక్టోరల్ అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మృతి చెందిన ఓటర్ల పేర్ల తొలగింపు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించి, మరణ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన తర్వాతనే ఓటరు జాబితా నుంచి పేరు తొలగించాలని కలెక్టర్ సూచించారు.