షాబాద్, ఏప్రిల్ 15: నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ల ప్రక్రియను సీసీ కెమెరాల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని రంగారెడ్డిజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. సోమవారం రాజేంద్రనగర్ ఆర్ఓ కార్యాలయంలో ఏఆర్ఓ, ఏఈఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఈ నెల 18వ తేది నుంచి చేపట్టే నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏఆర్ఓ, ఏఈఆర్ఓలకు సూచించారు.
నామినేషన్ స్వీకరించే రోజు నుంచి ప్రక్రియ ముగిసే వరకు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వందమీటర్ల దూరం వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ఇతరులను ఎవరిని ప్రవేశించకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేషన్ వేసే వారితో పాటు మరో నలుగురిని అనుమతించాలని తెలిపారు. ఉదయం 11గంటలకు ముందు, మధ్యాహ్నం 3గంటల తర్వాత నామినేషన్లు స్వీకరించ కూడదని తెలిపారు. నామినేషన్ల స్క్రూట్నిని ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారనే సమాచారం అభ్యర్థులకు తెలియజేయాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్ల పూర్తి ప్రక్రియను సీసీ కెమెరాలు, వీడియో గ్రాఫింగ్ మధ్య చేపట్టాలన్నారు.
రిటర్నింట్ అధికారి కార్యాలయానికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయించుకోవాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియపై అధికారులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని, అదే విధంగా అభ్యర్థులకు తెలియజేయాలన్నారు. నామినేషన్లు దాఖలైనప్పటి నుంచి అభ్యర్థుల వ్యయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అభ్యర్థుల వ్యయ వివరాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్ఓ సంగీత, డీసీపీ శ్రీనివాస్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్ఓలు, ఎన్నికల విభాగం అధికారి సైదులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.