షాబాద్, జనవరి 19: చేవెళ్ల మండలంలోని గొల్లపల్లిలోని శ్రీ బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలను రంగారెడ్డిజిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా శుక్రవారం చేవెళ్ల శ్రీ బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రతిపాదించిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఈఆర్ఓ, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి ఈ కళాశాలలో అనువుగా ఉన్న గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, వికారాబాద్, తాండూరు, పరిగి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడంతో ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నది. పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్లు, రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతపరమైన అంశాలను ఈ.ఆర్.ఓ, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలన జరిపారు.
బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భవన్ సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మ్యాప్ను పరిశీలించి ప్రస్తుతం కౌంటింగ్ నిర్వహణకు ఏ మేరకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నది పరిశీలించారు. ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా నిర్వహించేందుకు బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందా, లేదా అన్నది మరింత సమగ్రంగా పరిశీలన జరపాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట చేవెళ్ల ఆర్డీవో సాయిరాం, డీసీపీ, సంబంధిత అధికారులు తదితరులున్నారు.