ఇబ్రహీంపట్నం, జనవరి 27 : రానున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ శశాంక కోరారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటించనున్న సందర్భంగా అవసరమైన మార్పులు, చేర్పులు, సవరణలు, తొలగింపులు అన్నింటికీ ఈ నెల చివరి వరకు సరిచేసి పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందిస్తామన్నారు.
జిల్లాలో స్విప్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించామన్నారు. సమ్మర్ స్పెషల్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 22వరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల చివరి వరకు పరిష్కరించి స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో శనివారం తహసీల్దార్లతోనూ కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ భూముల పర్యవేక్షణ నిరంతరాయంగా జరగాలని, కబ్జాదారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీ ప్రభుత్వ భూములు గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తుది జాబితా రూపొందించుటకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించి ఈనెలాఖరు వరకు పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.