ధారూరు, ఫిబ్రవరి 14: జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన రూ.60 కోట్ల పనులను మార్చి లోపు పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ ఉపాధి పనులు, మన ఊరు-మన బడి, అటెండెన్స్ యాప్ పని తీరుపై జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్స్, వివిధ శాఖల ఇంజినీర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి15లోపు ఎఫ్టీవో జనరేట్ చేసి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయనట్లయితే నిధులు రద్దవుతాయని తెలిపారు.
గ్రామపంచాయతీల్లో సర్పంచులు ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టే పనులకు కచ్చితంగా నిధులు మంజూరవుతాయని భరోసా ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం చేపట్టే పనుల్లో వచ్చే సోమవారం నాటికి పురోగతి లేకుంటే వాటిని రద్దు చేసి వేరే పనులకు మంజూరు ఇవ్వనున్నట్లు తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణాలకు ఇప్పటికే 717 పనులకు రూ.60కోట్ల అంచనాలకు మంజూరు ఇచ్చినట్లు.. శుక్రవారం వరకు కావలసిన మెటీరియల్ను సమకూర్చుకొని సోమవారం నుంచి పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
సీసీ రోడ్ల నిర్మాణానికి ఇసుక రవాణాను అనుమతించాలి
సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అవసరం మేరకు ఇసుకకు అనుమతించాలని.. పురోగతిలో ఉన్న పనులను ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి పంపాలని తహసీల్దార్లు, ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. కూలీలకు చెల్లించాల్సిన వేతనాలపై గురువారం లోపు ఎఫ్టీవో జనరేట్ చేసి పూర్తి చేయాలని తెలిపారు. మన ఊరు – మన బడి కింద చేపట్టే పనులను వేగవంతం చేయాలని సంబంధిత ఇంజినీర్లను కలెక్టర్ ఆదేశించారు. మొదటి విడుత పాఠశాలల్లో మార్చి 16 వరకు అన్ని పనులు పూర్తి చేసి 31 వరకు పాఠశాలల ప్రారంభోత్సవాలు కావాలని సూచించారు.
పాఠశాలల్లో 12 విధాల పనులకు సంబంధించి ఏయే దశలో ఉన్నాయో శుక్రవారం వరకు పూర్తి సమాచారాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అటెండెన్స్ యాప్లో హాజరు లేకుంటే వేతనాలు ఇవ్వబడవని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఉద్యోగి అటెండెన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీవో కృష్ణన్, డీపీవో తరుణ్కుమార్, డీఈవో రేణుకాదేవి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్, ఇరిగేషన్ ఈఈ రేణుక, టీఎస్ఈడబ్ల్యూడీసీ డీఈ రాజు ఉన్నారు.
ఎన్ఆర్ఈజీఎస్ పనులను మార్చి 15 లోగా పూర్తి చేయాలి
కోట్పల్లి : ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పనులను మార్చి 15 లోగా పూర్తి చేయాలని మండలస్థాయి అధికారులు, సర్పంచులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పేర్కొనారు. గ్రామపంచాయతీల్లో అభివృద్ధికి కేటాయించిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులను సద్వినియోగం చేసుకుని పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.