రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడల్లో నైపుణ్యం ఉన్నవారిని వెలికి తీసేందుకు రాష్ట్ర సర్కార్ సీఎం కప్ పోటీలను నిర్వహిస్తూ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతున్నది. ఇప్పటికే మండలస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లాస్థాయి క్రీడలకు ఎంపిక చేయగా, సోమవారం అట్టహాసంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆటలు ఆరంభమయ్యాయి. వికారాబాద్ జిల్లాకు సంబంధించి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో కలెక్టర్ నారాయణరెడ్డి క్రీడలను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాస్థాయి పోటీలకు సంబంధించి సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో కలెక్టర్ హరీశ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి క్రీడాపోటీలను ప్రారంభించారు. పండుగ వాతావరణంలో పోటీలు కొనసాగాయి. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన జట్లు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో ఆడనున్నాయి.
– వికారాబాద్/ఆర్కేపురం, మే 22
వికారాబాద్, మే 22 : విజయానికి అడ్డొచ్చే ఏదైనా విషంగా భావించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో మూడు రోజుల పాటు (మే 22 నుంచి 24 వరకు) నిర్వహించే జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలోని 18 మండలాలకు చెందిన 4వేల మంది క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువతకు జీవితంలో విద్య ఎంత ముఖ్యమో, క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. గ్రామీణ, మండల స్థాయి నుంచి ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని కనబరిచి జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని ఆయన తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఖర్చుకు వెనుకాడకుండా క్రీడాకారులకు తాగునీటితోపాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని డీవైఎస్వోను కలెక్టర్ ఆదేశించారు. క్రీడలు సుహృద్భావ వాతావరణంలో నిర్వహించేలా పీఈటీలు తమ తోడ్పాటును అందించాలని కోరారు. క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి హన్మంత్రావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశ్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సత్తయ్య పాల్గొన్నారు. అనంతరం తాండూరు, వికారాబాద్ బాలుర జట్లతో పాటు పరిగి, పూడూరు బాలికల కబడ్డీ జట్లను పరిచయం చేసుకొని టాస్ వేసి ఆటలను ప్రారంభించారు.
క్రీడలను సద్వినియోగం చేసుకోవాలి
ఆర్కేపురం : రంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ హరీశ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి పోటీలను ప్రారంభించారు. 3 రోజులపాటు కొనసాగే పోటీలకు రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాలకు సంబంధించిన జట్లు పాల్గొంటాయి. 11 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. మొదటి రోజు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి విద్యార్థులను క్రీడల్లో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో సీఎం కప్ పోటీలను నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇలాంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని ఆమె సూచించారు. క్రీడా రంగంలో గెలవడం, ఓడడం సహజమేనని పేర్కొన్నారు. 15 నుంచి 35 సంవత్సరాలున్న యువత తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొనవచ్చని అనితారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, తెలంగాణ పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి పాల్గొన్నారు.