వికారాబాద్, మార్చి 4 : ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, టీఏలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గ్రామ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ యంత్రాంగం కూలీల సంఖ్యను పెంచుతూ పనులు చేయించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో జాబ్కార్డు ఉన్న వారందరికీ పని కల్పిస్తూ ముందుకెళ్లాలని ఆదేశించారు. అనుకున్న అంచనా ప్రకారం కూలీల సంఖ్యను పెంచుకోవాలన్నారు.
క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని గ్రామానికి ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. గ్రామ పరిధిలో ఉండే చిన్న చిన్న సమస్యలను మండల అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందాలని సూచించారు.
గ్రామాల్లో ఎక్కడైనా పైప్ లీకేజీలుంటే మరమ్మతులు చేపట్టాలన్నారు. పంచాయతీ సెక్రటరీలు, ఏఈలు , ఎంపీడీవోల ఆధ్వర్యం లో తాగునీటి సమస్యపై సమావేశాలు ఏర్పాటు చేసుకొని పరిష్కరించాలన్నారు. మండలాల వారీగా ఎన్ఆర్ఈజీఎస్ పనుల ప్రగతిపై చర్చించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి సుధారాణి, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, గ్రిడ్ ఈఈ చల్మారెడ్డి, ఎంపీడీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.