వికారాబాద్, జనవరి 24 : ఉద్యాన పంటలు సాగు చేస్తూ రైతులు అధిక లాభాలు పొందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మామిడి సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ముందుగా కలెక్టర్తోపాటు రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ బి.నీరజాప్రభాకర్, శాస్త్రవేత్తలు, అధికారులతో జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వికారాబాద్ ప్రాంతం అన్ని పంటల సాగుకు అనుకూలమని రైతులు ఉద్యాన పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా ఎదుగాలన్నారు. ప్రభుత్వం ఉద్యానవన పంటల సాగుకై అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 13వేల ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు సాగవుతున్నాయన్నారు. అనంతగిరి రైతు ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేసి మామిడి పండ్లను దేశ, విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.
విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ బి.నీరజాప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లాలో కూరగాయలు, పూలు, పండ్ల సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. ఆ దిశగా రైతులను అధికారులు ప్రోత్సహించాలన్నారు. యువ రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉద్యాన సాగులో ముందుకుసాగాలన్నారు.
తక్కువ వనరులతో ఎక్కువ లాభం పొందే ఉద్యాన పంటలను సాగు చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ సంచాలకుడు భగవాన్ , ఏజీఎం ఆర్.పి. నాయుడు, ఉపసంచాలకుడు మధుసూదన్, ఎఫ్పీవో డైరెక్టర్ సుబ్బారెడ్డి, ఏఆర్ ఫామ్ ఎండీ మహ్మద్ రఫీ, ఉద్యాన శాఖ అధికారులు కమల, వైజయంతి, అర్చన, విజయ్ కుమార్, బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారిణి గుత్తా జ్వాలా పాల్గొన్నారు.
పూడూరు : మండల పరిధిలోని అంగడిచిట్టెంపల్లి, పూడురు గ్రామాల్లో ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ నీరజాప్రభాకర్ సంబంధిత అధికారులతో పర్యటించారు. అనంతరం రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఉద్యాన పంటల సాగుకు ఇక్కడి నేలలు అనుకూలంగా ఉన్నాయని పండ్లు, కూరగాయల సాగుతో రైతులు మంచి లాభాలు పొందాలని సూచించారు.