వికారాబాద్, మార్చి 2 : ధరణి భూ సమస్యలపై నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ధరణి స్పెషల్ డ్రైవ్పై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ధరణిలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. మార్చి 9 వరకు జరిగే ధరణి స్పెషల్ డ్రైవ్ తేదీల వారీగా అధికారులు గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న ధరణి భూముల పరిష్కారానికి మండలానికి మూడు బృందాల చొప్పున అధికారులను నియమించి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు తెలిపారు.
ధరణిలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి అధికారులు గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు. రైతులు వారి సమస్యల పరిష్కార దిశగా అధికారులకు సహకరించాలని కోరారు. జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నిక అనంతరం తదుపరి ప్రజావాణిని నిర్వహించే సమయాన్ని వెల్లడిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.