వికారాబాద్, జనవరి 19 : కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై శాఖలవారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొడంగల్ ప్రభుత్వ దవాఖానను 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
దవాఖానలో వాటర్ ప్లాంట్, రెండు అంబులెన్సులు, జనరేటర్తో పాటు అవసరమైన సిబ్బంది కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న డయాలసిస్ సెంటర్ ను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ద్వారా అవసరమైన సింగిల్, డబుల్ రోడ్లతో పాటు జీపీ బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్, వంతెనలు, అతిథి గృహం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
గురుకుల పాఠశాలలు, కళాశాలల భవనాల నిర్మాణం కోసం స్థలాలను కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, డొమెస్టిక్కు సంబంధించి నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం అవసరమైన ప్రాంతాల్లో కొత్త ట్రాన్ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖ ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి అవసరమైన సాగు తాగు నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యానవన శాఖ ద్వారా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు 50 ఎకరాల స్థల సేకరణ వారం రోజుల్లో జరుగాలన్నారు.
పశుసంవర్ధక శాఖను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని, వ్యవసాయ శాఖకు సంబంధించిన డిప్ల్లమా కళాశాల ఏర్పాటుకు నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలో జిల్లా స్థాయి తరహాలో అభివృద్ధి పరిచేందుకు అన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసి, ప్రత్యేక అధికారికి సోమవారం వరకు అందజేయాలని అన్నారు. అధికారులందరూ పూర్తి బాధ్యతతో చురుకుగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.