రంగారెడ్డి, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఫ్లైయింగ్ స్కాడ్, సర్వేలెన్స్ బృందాలు, రాజకీయ పార్టీల నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలో 52 ఫ్లయింగ్ స్వ్యాడ్లు 24 గంటలు పర్యవేక్షిస్తుంటాయన్నారు. అక్రమంగా డబ్బు, మద్యం సరఫరా, ప్రలోభాలు, బహుమతులు ఇవ్వడం తదితర వాటిని పకడ్బందీగా నియంత్రించాలని సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చునూ ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఎలాంటి రశీదు లేకుండా 50వేల రూపాయల కంటే అధికంగా డబ్బును రవాణా చేస్తే సీజ్ చేయాలని ఆదేశించారు.
80 ఏండ్లు పైబడిన వృద్ధ్దులు, దివ్యాంగ ఓటర్లు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన ఐదు రోజుల్లోపు 12-డీ ఫారం పూర్తి చేసి బీఎల్వోలకు ఇవ్వాలని సూచించారు. రాజకీయ నాయకులు కూడా ఎన్నికల అధికారులకు సహకరించాలని కోరారు. ఈనెల 31 వరకు ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. పోలింగ్ తేదీకి ఐదు రోజుల ముందుగానే ఓటర్లకు సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం తదితర వివరాలతో ఓటరు స్లిప్పులను అందజేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, డీఈవో సుశీందర్ రావు, ఎన్నికల విభాగం అధికారి సైదులు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.