కారు గుర్తుకు ఓటేసి అబద్ధాల కాంగ్రెస్ పీడను వదిలించుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. మన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపోళ్లు కుట్ర చేస్తే వారిని పట్టించి జైలుకు పంపించిన నిజాయితీ పరుడు రోహిత్రెడ్డి అని అన్నారు. తాండూరులో పీజీ, పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో తాండూరు ప్రజలు కాగ్నా నది దగ్గర గుంతలు తీసి నీళ్లు తెచ్చుకొని వడబోసి తాగేవారని, కానీ ఇయ్యాలా మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరందుతున్నదన్నారు. కొడంగల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యమన్నారు.
2018లో పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కొడంగల్లో ప్రగతి పరుగులు తీస్తున్నదన్నారు. రూ. వేల కోట్లను తెచ్చి నియోజకవర్గ రూపురేఖలను మార్చారన్నారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి నా కొడుకులాంటి వ్యక్తి అని అన్నారు. ఇక్కడి ప్రజలు కోరుకున్నట్లు గెలిచిన నెల రోజుల్లోనే పరిగిలో పాలిటెక్నిక్ కాలేజీతోపాటు దాదాపూర్, కంకల్ మండలాలను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఏడాదిలో జిల్లాకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామన్నారు. కాంగ్రెస్ గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులే పాలించుకునే అవకాశం కల్పించామన్నారు. ఎన్నికలు వస్తే ఆగం కాకుండా ఆలోచించి ఓటేయాలన్నారు. గత 50 ఏండ్లలో ఏం జరిగింది.. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందనేది ప్రజలు పోల్చి చూసి నిర్ణయం తీసుకోవాలన్నారు. నాడు కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయేవని, నేడు నిరంతర విద్యుత్తో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ను గెలిపించి కరెంట్ కష్టాలను మళ్లీ తెచ్చుకుందామా? అని ప్రశ్నించారు. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ప్రగతికి పట్టం కట్టాలన్నారు.
-వికారాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్ జిల్లాలోని పరిగి, తాండూరుతో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు జనసంద్రమయ్యాయి. వేలాదిగా పోటెత్తిన పార్టీ శ్రేణులు, స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలతో సభలు జరిగిన ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. గులాబీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో ఆ ప్రాంతాలు గులాబీ వనాలుగా మారాయి.
మూడు సభల్లోనూ సీఎం కేసీఆర్ ప్రసంగించినంత సేపు జనం శ్రద్ధగా విన్నారు. మధ్యమధ్యలో కేరింతలు, ఈలలు, నినాదాలతో సభా ప్రాంగణాలు దద్దరిల్లాయి. జై కేసీఆర్.. జైజై బీఆర్ఎస్.. కారుగుర్తుకే మన ఓటు.. అన్న నినాదాలు మిన్నంటాయి.‘గులాబీల జెండలమ్మ’ పాటకు మహిళలు చేసిన నృత్యాలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిది. కళాకారుల ఆటపాటలు అలరించాయి.