CM KCR | తెలంగాణ హరిత స్ఫూర్తి ప్రదాత, సీఎం కేసీఆర్ సోమవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామ సరిహద్దులోని మ్యాక్ ప్రాజెక్టు వద్ద ఉన్న అర్బన్ ఫారెస్టు పార్కులో మొక్కలను నాటనున్నారు. అనంతరం పక్కనే ఉన్న మైదానంలో జరుగనున్న బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టింది. సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతికుమారి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, కలెక్టర్ హరీశ్ తదితరులు ఆదివారం పరిశీలించారు. సీఎం సభ సందర్భంగా పార్టీ జెండాలు, తోరణాలు, ఆర్చీలతో తుమ్మలూరు ప్రాంతం గులాబీమయమైనది.
-రంగారెడ్డి, జూన్ 18(నమస్తే తెలంగాణ)/ బడంగ్ పేట
రంగారెడ్డి, జూన్ 18 (నమస్తే తెలంగాణ)/బడంగ్పేట : తెలంగాణ హరితస్ఫూర్తి ప్రదాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ‘హరితోత్సవం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామ సరిహద్దులోని మ్యాక్ ప్రాజెక్టు వద్ద ఉన్న ఫారెస్టు పార్కులో మొక్కలను నాటనున్నారు. అక్కడ ఏకకాలంలో 25వేల మొక్కలు నాటేలా అధికారులు ఏర్పాటు చేశారు. అనంతరం పక్కనే ఉన్న గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరుకానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టింది. సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ఆదివారం పరిశీలించారు. సీఎం కేసీఆర్కు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హరితహారంపై లఘుచిత్ర ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శన వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రహదారులు, కూడళ్ల వద్ద భారీ కటౌట్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలు, తోరణాలు, ఆర్చీలతో తుమ్మలూరు ప్రాంతం గులాబీమయమైంది.
పార్కింగ్ ఇలా..
సీఎం పర్యటన సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. నాలుగు చోట్ల వాహనాల కోసం పార్కింగ్ను ఏర్పాటు చేశారు.
ఏర్పాట్ల పరిశీలన
సీఎం పర్యటన సందర్భంగా తుమ్మలూరు వద్ద ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పరిశీలించారు. సభాస్థలిని, బహిరంగ సభ నిర్వహించే గ్రౌండ్ను పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో సీఎస్ శాంతికుమారి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి, కలెక్టర్ హరీశ్, ఐఎఫ్ఎస్, పీసీపీఎఫ్ రాకేశ్ దోబ్రియల్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, అటవీశాఖ అధికారి సుధాకర్రెడ్డి ఉన్నారు.