ఉమ్మడి జిల్లా ప్రగతి పథంలో పరుగు పెడుతుండగా.. గ్రేటర్లోనూ పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నెలంతా వరుస శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో గ్రేటర్ అభివృద్ధి వేడుకకు వేదికగా మారనున్నది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేస్తూ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 6వ తేదీన ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించనున్నారు. 9న సీఎం కేసీఆర్ ఎయిర్ పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెలలోనే కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభంతోపాటు విడుతలవారీగా మరిన్ని అభివృద్ధి పనులకు బీజం పడనున్నది. ఈ కార్యక్రమాలకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
-సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, డిసెంబరు 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. సంక్షేమం, అభివృద్ధిలో జోడెద్దుల్లా పరుగులు పెడుతూ దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నది. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా యేటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఇప్పటికే విడతల వారీగా అభివృద్ధి ఫలాలు అందుబాటులోకి తీసుకురాగా..నేటి నుంచి ఈ నెలాఖరునాటి వరకు వరుస అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని ఏడు చోట్ల సుడిగాలి పర్యటన చేసి రూ. 28.51కోట్ల అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు. 5న చారిత్రక బన్సీలాల్పేట మెట్ల బావిని అందుబాటులోకి తీసుకువచ్చి అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా నిలుపనున్నారు. 6న ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ ఫలాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి కేటీఆర్ వరుస పర్యటనలను పరిశీలిస్తే…
5న బన్సీలాల్పేట మెట్ల బావి ప్రారంభం
చారిత్రక బన్సీలాల్పేట మెట్ల బావిని ఈ నెల 5న పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారు. నిజాం కాలంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చిన ఈ మెట్ల బావి కాలక్రమేణా చెత్త చెదారంతో నిండిపోయింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులను చేపట్టగా, సుమారు 500 ట్రకుల చెత్తను పూర్తిస్థాయిలో తొలగించారు. బావి పునరుద్ధరణతో పాటు పరిసరాలలో అభివృద్ధి, నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ప్రస్తుతం నీటితో బావి కళకళలాడుతుంది. పర్యాటకులను ఆకర్షించేలా, చిన్న ,చిన్న వేడుకలను నిర్వహించుకొనేలా సీటింగ్తో కూడిన గార్డెన్, యాంపీథియేటర్ నిర్మించారు. బావి చరిత్రను తెలియజేసే సమాచారం, ఫొటోలను, పూడికతీత సమయంలో లభ్యమైన కొన్ని వస్తువులను ఇకడ ప్రదర్శనకు ఉంచారు. మెట్లబావిలో పురావస్తు శాఖ నిబంధనలను అనుసరించి లైటింగ్ను ఏర్పాటు చేయటం విశేషం.
7 నుంచి హైటెక్స్ కన్వెన్షన్ తయారీ దారుల ఫెయిర్
మారేడ్పల్లి, నవంబర్ 1: షోలాపూర్ గార్మెంట్స్ తయారీదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు హైటెక్ సిటీలోని హైటెక్స్ కన్వెన్షన్ తయారీ దారుల ఫెయిర్ జరుగుతుందని సంఘం డైరెక్టర్ సతీశ్ పవార్ గురువారం తెలిపారు. షోలాపూర్ గార్మెంట్స్ మన దేశానికి ప్రపంచంలో ఏకైక సోర్సింగ్ హబ్గా ప్రమోట్ చేసేలా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కన్వెన్షన్ తాయారీ దారుల ఫెయిర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రదర్శనలో మఫత్లాల్, ఎస్ కుమార్, వాలజీ, క్యూమాక్స్, గంగోత్రి, శుభటెక్ తదితర మిల్లులు పాల్గొంటాయని చెప్పారు.
పెంపుడు కుక్కలకు దహనవాటిక
పెంపుడు కుక్కల దహన సంస్కారానికి ఫతుల్లాగూడలోని ఎనిమల్కేర్ సెంటర్ను దాదాపు రూ. కోటితో ఏర్పాటు చేశారు. జంతు ప్రేమికులకు ఈ నెల 6న అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్కలు మరణిస్తే వాటిని పూడ్చేందుకు జంతు ప్రేమికులకు ఇబ్బందులు ఉండకూడదని ఈ దహనవాటికను ఏర్పాటు చేశారు. జంతువులు చనిపోయినపుడు పీపుల్స్ ఫర్ ఎనిమల్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించినట్లయితే నామమాత్రం రుసుముతో దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఈ అవకాశాన్ని జంతు ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
రెండు జాతీయ రహదారులను కలుపుతూ లింకు రోడ్డు
గ్రేటర్ శివారులో వరంగల్- విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ లింకు రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. ప్రధానంగా ఉప్పల్, ఎల్బీనగర్ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా 4.74 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు. పీర్జాదిగూడ రోడ్ నుంచి నాగోల్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డుకు రహదారిని కలిపారు. వరంగల్ హైవే మీదుగా వెళ్లే వారు, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఉప్పల్ ప్రాంత వాసులు విజయవాడ హైవే వైపు వెళ్లాలంటే ఈ లింకు రోడ్డు ఎంతగానో దోహదపడనుంది. ప్రస్తుతం ఉప్పల్, నాగోల్ల మధ్య మూసీ మీద ఉన్న ఇన్నర్ రింగు రోడ్డు తరహాలో విశాలంగా నాలుగు వరుసలతో అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ చిక్కులు ల్లేకుండా రెండు వైపులా రాకపోకలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. పీర్జాదిగూడ కమాన్ నుంచి ఉప్పల్ భగాయత్ లే అవుట్ మీదుగా మూసీ నది దాటుతూ నాగోల్ , బండ్లగూడ, ఆటోనగర్కు సులువుగా చేరుకోవచ్చు. దీని వల్ల తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరాభారం తగ్గడంతో పాటు 20 నిమిషాల నుంచి పది నిమిషాలు మాత్రమే ప్రయాణం సాగనుంది.
మూడు మతాలకు..ముక్తిఘాట్
గ్రేటర్ పరిధిలోని ఎల్బీనగర్ నియోజకవర్గం ఫతుల్లాగూడలో సుమారు 6 ఎకరాల స్థలంలో ముక్తిఘాట్ పేరిట అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.4.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులు పూర్తయ్యాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన వ్యక్తుల మృతదేహాలకు అంత్యక్రియలు సాఫీగా జరిగేలా అత్యాధునిక మౌలిక వసతులను కల్పించారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం ముక్తిఘాట్లో 20 శాతం మాత్రమే నిర్మాణాలు ఉంటాయి. పూర్తిగా సౌర విద్యుత్ వినియోగం, ప్రత్యేకంగా సోలార్ ప్లాంట్, ఘాట్ చుట్టూ 40 అడుగుల చెట్లు కనువిందు చేయనున్నాయి. స్నానపు, విశ్రాంతి గదుల్లో నీటిని పునర్వినియోగించుకునేలా 0.2 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. సేద తీరేలా ఉద్యానం, ఆకట్టుకునేలా ల్యాండ్ స్కేపింగ్, అలంకరణ, పూల మొక్కలు ఏర్పాటు చేసి పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. ఈ ముక్తిఘాట్ను వెళ్లేందుకు 40 ఫీట్ల బీటీ రోడ్ ఏర్పాటు చేశారు. ఈ మూడు మతాలకు చెందిన శ్మశాన వాటికలకు వెళ్లే ప్రవేశ ద్వారాలను విడివిడిగా ఏర్పాటు చేస్తూ ఒక్కోదానికి మధ్య ప్రహరీ నిర్మించారు.
ఎస్ఎన్డీపీ రెండో ఫలితం
ఎస్ఎన్డీపీలో భాగంగా సనత్నగర్ పికెట్ నాలా బ్రిడ్జి తొలి ఫలితం రాగా రెండో ఫలితం ఎల్బీనగర్లో రానుంది. రూ. 7.26 కోట్ల వ్యయంతో బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు బాక్స్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసుకోగా, ఈ నెల 6న అందుబాటులోకి రానుంది.
శాటిలైట్ బస్ టెర్మినల్కు శంకుస్థాపన
నగర శివారులో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వనస్థలిపురం పరిధిలో సుమారు రూ.18 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక హంగులతో శాటిలైట్ బస్ టెర్మినల్ను అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మహావీర్ హరిణి వనస్థలి జింకల పారు సమీపంలో 1.2 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్నారు. కోర్ సిటీ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో ఎల్బీనగర్ వద్ద జిల్లాలకు వెళ్లే బస్సులతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ ట్రాఫిక్ గందరగోళాన్ని పరిషరించడానికి హెచ్ఎండీఏ ఈ ప్రాజెక్టును ఇంటర్సిటీ, ఇంటర్-స్టేట్ బస్సుల కోసం హరిణి వనస్థలి పార్ సమీపంలో శాటిలైట్ వేసైడ్ బస్ టెర్మినల్ను నిర్మిస్తోంది. హెచ్ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి డిజైన్లను రూపొందించారు. ప్రయాణికులు, ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు వారి సిబ్బందికి ఇంటిగ్రేటెడ్ సౌకర్యాలను అందించేలా దీన్ని నిర్మించనున్నారు.
కొత్తగూడ ఫ్లై ఓవర్ రెడీ
ఐటీ సిగలోకి మరో వంతెన రాబోతున్నది. ఇటీవల శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ను అందుబాటులోకి తీసుకువచ్చి ఓఆర్ఆర్ నుంచి హైటెక్ సిటీకి ప్రయాణం సులువు చేసిన జీహెచ్ఎంసీ కీలక రద్దీ ప్రాంతాలైన బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా ఈ కొత్తగూడ ఫ్లై ఓవర్ నిర్మించారు. ఈ నెలాఖరులోగా ఈ వంతెనను ప్రారంభించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాజెక్టు వ్యయం రూ. 263.09 కోట్లు కాగా 3 కిలోమీటర్ల మేరలో 2,3, 4, 5 లేన్లతో నిర్మాణం జరుగుతున్నది. అండర్పాస్ పొడవు 470 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు ఉంది. గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్సిటీ మధ్య ప్రధాన కనెక్టివిటి ఏర్పడుతుంది. ఈ ఫ్లైఓవర్తో బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కొండాపూర్ జంక్షన్లో 65 శాతం మేర ట్రాఫిక్కు విముక్తి లభిస్తుంది.
9న ఎయిర్ పోర్ట్ మెట్రోఎక్స్ప్రెస్ కారిడార్కు శంకుస్థాపన…
రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కారిడార్ను విస్తరించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. డిసెంబర్ 9 న సీఎం కేసీఆర్ ఎయిర్ పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. రానున్న మూడేండ్లలో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనుంది. ఈ మార్గాన్ని ఐకియా నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడా రోడ్డు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు వద్దగల నానక్ రామ్గూడ జంక్షన్ను తాకుతూ వెళుతుంది. ఔటర్ వెంట లోపలి వైపు ఉన్న రైల్వే కారిడార్కు కేటాయించిన స్థలంలోంచి నిర్మాణం జరుగుతుంది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా మెట్రో రైలు నడుస్తుంది. మొత్తం 31 కిలో మీటర్ల పొడవుతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టు ను రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్నది. ఇప్పటికే మెట్రో మొదటి దశలో నిర్మించిన కారిడార్-3(నాగోల్ నుంచి రాయదుర్గం) 29 కి.మీ ఉండగా, దానికి పొడిగింపుగా ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్టు మరో 31 కి.మీ మేర ఉంటుంది.
మరిన్నిఎస్ఎన్డీపీ ఫలాలు
ఈ నెలాఖరులోగా విడతల వారీగా ఎస్ఎన్డీపీ ఫలాలు అందుబాటులోకి రానున్నాయి. గుర్రం చెరువు వద్ద కల్వర్టు, అలుగు నిర్మాణం, పల్లె చెరువు తూము, అలుగు నిర్మాణం పనులు పూర్తి, అప్పా చెరువు వద్ద 550 మీటర్ల పొడవున బాక్స్ డ్రైన్, ప్రహరీ నిర్మాణం, అలుగు పునరుద్ధరణ, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన పనులు తుది దశకు చేరుకున్నాయి. మన్మానికుంట ఫంక్షన్హాల్ వరకు 540 మీటర్ల నాలా నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. రాజేంద్రనగర్ పిల్లర్ నం. 191దగ్గర పోర్ట్ వ్యూ కాలనీలో చేపట్టిన 860 మీటర్ల నాలా నిర్మాణ పనులు, బాతుల చెరువు, శివం రోడ్డు, వీఎస్టీ కూడలి సమీపంలోని నల్లపోచమ్మ దేవాలయం వద్ద చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.