సీఎం కేసీఆర్ పర్యటనకు కొంగరకలాన్ సిద్ధమైంది. ఇక్కడ నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ను నేడు ఆయన ప్రారంభించనుండగా, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మంత్రి సబితారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్ పర్యవేక్షణలో సర్వం సిద్ధం చేశారు. మామిడి తోరణాలు, పూలు, లైటింగ్స్తో నూతన కలెక్టరేట్ను అందంగా ముస్తాబు చేశారు. కొంగరకలాన్కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోనున్న సీఎం కేసీఆర్.. మొదటగా కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తరువాత కలెక్టరేట్కు సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 50వేల మందికి పైగా హాజరయ్యే ఈ సభ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 150 మంది కూర్చునేలా సభా వేదికను సిద్ధం చేశారు. 20 ఎకరాలను వాహనాల పార్కింగ్కు వినియోగిస్తున్నారు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తును చేపడుతున్నారు. మరోవైపు ఔటర్ రింగురోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు భారీగా స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పరిసర ప్రాంతాలన్నీ గులాబీమయంగా మారాయి.
సభా వేదికను పరిశీలిస్తున్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్రెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్
రంగారెడ్డి, ఆగస్టు 24, (నమస్తే తెలంగాణ) : కొంగరకలాన్లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ కొంగరకలాన్కు చేరుకోనున్నారు. మొదట సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు. అనంతరం సర్వమత ప్రార్థనలు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. తర్వాత నూతన కలెక్టరేట్కు సమీపంలో సిద్ధం చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను గురువారం ప్రారంభించనున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. దీంతోపాటు బహిరంగ సభ ఏర్పాటులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంత్రి సబితారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు కలెక్టరేట్ ప్రారంభోత్సవంతోపాటు బహిరంగ సభకు వచ్చే జిల్లా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా 20 ఎకరాల్లో పార్కింగ్ నిమిత్తం ఏర్పాట్లు చేశారు. మరోవైపు మామిడి తోరణాలు, పూలు, లైటింగ్స్తో నూతన కలెక్టరేట్ను ముస్తాబు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కొంగరకలాన్లో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, బహిరంగ సభలో పాల్గొననున్న దృష్ట్యా రాచకొండ సీపీ మహేశ్భగవత్, అదనపు సీపీ సురేంద్రబాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బందోబస్తులో నలుగురు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 30 మంది సీఐలు, 70 మంది ఎస్ఐలు, వీరితో ఎస్వోటీ, ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇన్నేళ్లకు రంగారెడ్డిలోనే జిల్లా హెడ్క్వార్టర్..!
44 ఏండ్ల తర్వాత రంగారెడ్డికి జిల్లాలోనే జిల్లా కేంద్రం అందుబాటులోకి రానుంది. 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పాటుకాగా అప్పటి నుంచి హైదరాబాద్లోనే రంగారెడ్డి జిల్లా కేంద్రం ఉండడం గమనార్హం. చిన్న జిల్లాలతోనే సుపరిపాలన సాధ్యమని గుర్తించిన సీఎం కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను రంగారెడ్డితోపాటు వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఆయా జిల్లాలకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను కూడా మంజూరు చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో జిల్లా ప్రజల కల నెరవేరింది. ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలోని లక్డీకాపూర్లో ఉన్న రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ నేటి నుంచి రంగారెడ్డి జిల్లా పరిధిలో అందుబాటులోకి రానుంది.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, ఎంపీ
నేడు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ప్రారంభత్సవ ఏర్పాట్లతోపాటు బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి సబితారెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్, ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఏర్పాట్లు పూర్తి
జిల్లాలోని కొంగరకలాన్లో నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 ఎకరాల్లో 50 వేల మందితో భారీ జనసమీకరణతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి సబితారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డితోపాటు ఎంపీ రంజిత్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు తదితరులు 150 మంది కూర్చునేలా సభా వేదికను సిద్ధం చేశారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జన సమీకరణకు సంబంధించి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బహిరంగ సభకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతోపాటు మహేశ్వరం, కల్వకుర్తి, షాద్నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలిరానున్నారు.
ఒకే సముదాయంలో అన్ని శాఖల కార్యాలయాలు
జిల్లా సమీకృత కలెక్టరేట్ నేడు ప్రారంభం కానుండడంతో అన్ని శాఖలు ఇకపై ఒకే సముదాయం నుంచి పాలనను కొనసాగించనున్నాయి. పోలీస్, అగ్నిమాపక, రవాణా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖలు మినహా మిగతా అన్ని శాఖల కార్యాలయాలను సమీకృత కలెక్టరేట్లోనే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు లక్డీకాపూల్లో ఉన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కొన్ని శాఖల కార్యాలయాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. వ్యవసాయ శాఖతోపాటు వైద్యారోగ్య, జిల్లా ఖజానా శాఖ, ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు హైదరాబాద్లోని ఆయా ప్రాంతాల్లో ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులుండేవి. సమీకృత కలెక్టరేట్ సముదాయం అందుబాటులోకి రానుండడంతో జిల్లా ప్రజలకు కష్టాలు తప్పాయి. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల ప్రజలు ఔటర్ రింగ్రోడ్డు మీదుగా ఈజీగా కలెక్టరేట్కు చేరుకోవచ్చు.
ఇబ్రహీంపట్నం/ఆదిబట్ల, ఆగస్టు 24 : రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభిస్తున్నందున కొంగరకలాన్ గులాబీమయమైంది. కలెక్టర్ కార్యాలయం పరిసరాలతోపాటు బొంగుళూరు నుంచి తుక్కుగూడ వరకు ఓఆర్ఆర్ రెండువైపులా సర్వీసు రోడ్లు గులాబీ జెండాలతో నిండిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో కొంగరకలాన్కు వస్తున్నారు. తిరిగి ఆయన రోడ్డు మార్గం నుంచి వెళ్తుండటంతో ఆయన వెళ్తున్న రోడ్డు మొత్తం ముఖ్యమంత్రి, మంత్రుల ఫ్లెక్సీలతో నిండిపోయాయి. కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు గల రెండు కిలోమీటర్ల దూరం మొత్తం రోడ్డు కిరువైపులా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. కొంగరకలాన్ వద్ద గులాబీ తోరణాన్ని కూడా ఏర్పాటు చేశారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఆయన తనయకుడు ప్రశాంత్కుమార్రెడ్డికి సంబంధించిన వేలాది ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఆయన తనయుడు ప్రశాంత్కుమార్రెడ్డి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి రైతులు, మహిళలు, పార్టీ శ్రేణులను తరలించడానికి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. బహిరంగ సభాస్థలివద్ద ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, పలువురు జడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు భారీ హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. కొంగరకలాన్కు వచ్చే అన్ని దారులు గులాబీ జెండాలతో నిండిపోయాయి.
కలెక్టరేట్లో 34 శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఆయా శాఖలకు కేటాయించిన కార్యాలయాల్లో సంబంధిత అధికారులు సందడి చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. గత రెండు రోజులుగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కుమారుడు ప్రశాంత్కుమార్రెడ్డి(బంటి) బహిరంగ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏర్పాట్లపై మంత్రి సబితారెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తూ నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డిని ప్రశంసించారు.