పరిగి, ఆగస్టు 16 : వికారాబాద్లో రూ.60.70కోట్లతో నూతనంగా నిర్మాణం చేపట్టిన సమీకృత జిల్లా కలెక్టరేట్ను మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు హెలికాప్టర్లో 3.22 గంటలకు చేరుకున్న సీఎం కేసీఆర్కు మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆనంద్ నివాసానికి 3.30 గంటలకు చేరుకున్న సీఎం కేసీఆర్ కొద్దిసేపు ఉండి అక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకొని నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే ఆనంద్ను పార్టీ కార్యాలయంలోని ఆయన కుర్చీలో కూర్చుండబెట్టి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి సాయంత్రం 4.15 గంటలకు జిల్లా సమీకృత కలెక్టరేట్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాంబర్లోని కుర్చీలో కలెక్టర్ నిఖిలను కూర్చోబెట్టి కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులను సీఎం సన్మానించారు. అనంతరం వికారాబాద్కు మంజూరైన మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు సబితారెడ్డి, ప్రశాంత్రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, వాణీదేవి, జనార్దన్రెడ్డి, దయానంద్, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్, చేవెళ్ల, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డి, నరేందర్రెడ్డి, యాదయ్య, జీవన్రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస్గుప్తా, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కార్తీక్రెడ్డి, వికారాబాద్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్లు ఉన్నారు.
జిల్లాపైత సీఎంకు ప్రత్యేక అభిమానం
వికారాబాద్ జిల్లాపై సీఎం కేసీఆర్కు ప్రత్యేకమైన అభిమానముందని మంత్రి సబితారెడ్డి తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ మంజూరు చేస్తున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పుణ్యమా అని వికారాబాద్ జిల్లా ఏర్పాటైందన్నారు. శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, అనంతగిరిని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, వికారాబాద్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని, అనంత పద్మనాభస్వామి ఆలయానికి 50 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు.
హరీశ్వర్రెడ్డితో ఆప్యాయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్
వికారాబాద్లో ఎమ్మెల్యే ఆనంద్ నివాసంలో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా హరీశ్వర్రెడ్డితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తాను మహేశ్(పరిగి ఎమ్మెల్యే)కు చెబుతా.. ఒకరోజు ఇంటికి భోజనానికి రావాలని హరీశ్వర్రెడ్డిని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
వికారాబాద్/బొంరాస్పేట, ఆగస్టు 16 : వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం వికారాబాద్లో నిర్వహించిన బహిరంగసభ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నప్పుడు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రస్తావన తెచ్చినప్పుడు జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ముఖ్యంగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలా వద్దా అన్నప్పుడు వద్దు.. వద్దు అని, రైతు బీమా, రైతు బంధు పథకం వద్దా అన్నప్పుడు కావాలి.. కావాలి అని మహిళలు కరతాళధ్వనులతో తమ మద్దతు ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం ప్రకటించగానే ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఆకట్టుకున్న సాయిచంద్ పాటలు
సభలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, గాయకుడు సాయిచంద్ పాడిన పాటలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ విచ్ఛిన్నానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాల గురించి కళాకారులు పాటల రూపంలో ప్రజలను చైతన్యం చేశారు. సభాస్థలి నిండిపోవడంతో పాత్రికేయుల గ్యాలరీ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి ప్రజలు పెద్దఎత్తున వచ్చి చేరారు. వారు సభా ప్రాంగణంలోకి దూసుకురావడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. చివరకు సీఎం కేసీఆర్ సభా వేదికపైకి వచ్చి ప్రసంగిస్తుండగా ప్రజలు కళాకారుల కోసం ఏర్పాటు చేసిన స్టేజీపైకి రావడంతో వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. బహిరంగసభ సాయంత్రం నాలుగు గంటలకు ఉన్నా మధ్యాహ్నం 12 గంటల నుంచే సభాస్థలిలోకి రావడం ప్రారంభించారు. కేసీఆర్ రాకముందే సభాస్థలి పూర్తిగా నిండిపోవడంతో జనం బయట నిలబడ్డారు. సీఎం కేసీఆర్ కలెక్టరేట్ భవనం, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, వైద్య కళాశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం సభా వేదికపైకి సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు.
గులాబీమయంగా మారిన మార్గాలు
సీఎం రాక సందర్భంగా ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలతో పట్టణం గులాబీమయంగా మారింది. ముఖ్యంగా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే బ్రిడ్జి, ఎస్పీ కార్యాలయం మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు వారివారి అభిమాన ఎమ్మెల్యేలు, నాయకుల కటౌట్ల వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగడం కనిపించింది. సభకు వచ్చిన ప్రజలు కలెక్టరేట్ ఎదుట నిలబడి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.