షాద్నగర్టౌన్, ఆగస్టు 1: పచ్చని చెట్లతో సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ప్రతిష్టాత్మకంగా చేపడుతూ మొక్కలు నాటుతున్నారు. మనం నాటే మొక్కలతో కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తూ హరితహారంలో భాగస్వాములను చేస్తున్నారు. పచ్చని చెట్లతో వర్షాలు సకాలంలో కురుస్తూ పాడిపరిశ్రమ ఎంతో అభివృద్ధిని సాధించింది. హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెలు పచ్చని మొక్కలతో స్వాగతం పలికే విధంగా హరితహారం మొక్కలతో కళకళలాడుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో చేపట్టే హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు, స్వచ్ఛంధ సంస్థలు, యువజన సంఘాలు, యువకులందరూ భాగస్వాములవుతూ మొక్కలను నాటడంతో పాటు కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు.
తెలంగాణ సర్కార్ నిర్వహించే హరితహారం షాద్నగర్ మున్సిపాలిటీలో ప్రారంభమైంది. మున్సిపాలిటీలోని మూడు నర్సరీల్లో 2.60లక్షల మొక్కలు ఉన్నాయి. అందులో మున్సిపల్ టార్గెట్ 2,42,020 మొక్కలు ఉండగా ఇందులో ఇప్పటికే రోడ్డు డివైడర్లు, ఖాళీ స్థలాలతో పాటు పలు వార్డుల్లో మొక్కలను నాటారు. హరితహారం మొక్కలతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున మొత్తం 1,8,030 మొక్కలను పంపిణీ చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రస్తుతం పట్టణంలోని నర్సరీల్లో జామ, దానిమ్మ, ఉసిరి, కానుగ, టెకోమా, మర్రి, సన్నమల్లి, గుల్మోహర్, మహోగని, రావి, సీతాఫలం, గులాబీ, చైనా బాదం, సిసాల్పినియ, దొడ్డు మల్లి, నేరేడు, చామంతి, వేప, ఆకాశమల్లి, అశోక మొక్కలతో పాటు వివిధ రకాల పూల, పండ్ల మొక్కలు అందుబాటులో ఉంచారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో నాటిన మొక్కలను సంరక్షించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడంతో మొక్కలు ఏపుగా పెరుగుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి.
హరితహారం కార్యక్రమంలో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను పంపిణీ చేస్తాం. ఇప్పటికే మున్సిపాలిటీలోని రోడ్డు డివైడర్లు, ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటాం. హరితహారంలో అందరూ భాగస్వాములను కావాలి. హరితహార లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి.
– చీమ వెంకన్న, మున్సిపల్ కమిషనర్, షాద్నగర్