సమైక్యరాష్ట్రంలో దండగా అన్న వ్యవసాయాన్ని.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సరిపడా సాగునీరిస్తూ, 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తూ పండుగలా మార్చారు. పెట్టుబడి సాయం మొదలుకొని ధాన్యం కొనుగోలు వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తున్నది. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులకు అప్పుల తిప్పలు తప్పాయి. సకాలంలో పెట్టుబడి సాయం చేతికందుతుండడంతో రైతులు ఏ చింతా లేకుండా పంటలు సాగు చేసుకుంటున్నారు. ఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాకు రూ.3017.91 కోట్ల రైతుబంధు సాయాన్ని అందజేసింది. ప్రమాదవశాత్తు మృతి చెందిన రైతుల కుటుంబాలకు రైతుబీమా పెద్ద దిక్కవుతున్నది. ఈ పథకం కింద జిల్లాలో 4,413 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.220.65 కోట్ల బీమా సొమ్ము అందించింది. ఇప్పటివరకు రెండు దఫాల్లో రూ.1.50 లక్షల చొప్పున ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సమైక్య రాష్ట్రంలో వానకాలానికి సంబంధించి జిల్లాలో కేవలం 25,982 ఎకరాల్లో వరి సాగయ్యేది. స్వరాష్ట్రం సిద్ధించాక ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం ఏటా 1,25,456 ఎకరాలకు పైగా వరి సాగవుతున్నది.
-రంగారెడ్డి, జూన్ 2 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో వ్యవసాయ రంగంలో ప్రణాళికలు రచించి వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు సర్కార్ కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ‘రైతు బంధు’ పథకాన్ని తీసుకొచ్చారు. పంట పెట్టుబడులను ఇచ్చే విధంగా ఎకరాకు రెండు కాలాలకు రూ.10 వేల చొప్పున పంట పెట్టుబడిసాయాన్ని అందిస్తున్నారు. అంతే కాకుండా, రైతన్న ఏదేని కారణంగా మరణిస్తే, తన మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబం ఇబ్బందులు పడొద్దని ‘రైతు బీమా’ను తీసుకొచ్చింది. రైతన్న మరణిస్తే.. రూ.5 లక్షలను అందిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో వరి, మొక్కజొన్న, వేరు శనగ, పొద్దు తిరుగుడు, కుసుమలు, కందులు, జొన్నలు, ఆముదాలు, అలసందలు, పెసర్లు పండిస్తున్నారు.
రైతు బంధు పథకం…
నాడు రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలు కోసం దళారుల చుట్టూ తిరిగే వారు. నేడు రైతుకు ఆ పరిస్థితి లేదు. రైతాంగానికి పెట్టుబడి ఇబ్బంది లేకుండా ఉండటానికి రైతుబంధు పథకం కింద వానకాలం, యాసంగికి కలిపి రూ.10వేలను ఇస్తున్నారు. ఇప్పటి వరకు వానకాలం 2018 నుంచి యాసంగి 2022 వరకు 10 సీజన్లకు గాను 3,04,617 మంది రైతులకు రూ.3017.91 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది.
రైతు బీమా పథకం..
గత ప్రభుత్వాల హయాంలో ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే, ఆ రైతు మీద ఆధారపడిన కుటుంబం చిన్నా భిన్నం అయ్యేది. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘రైతు బీమా’ పథకం తీసుకువచ్చి రైతు కుటుంబానికి భద్రత, భరోసా కల్పిస్తున్నది ప్రభుత్వం. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతున్నది. ఇప్పటి వరకు 4,413 మంది రైతులు మరణించగా, వారి నామినీల ఖాతాల్లో మొత్తం రూ.220.65 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
రుణ మాఫీ..
రైతాంగ బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట రుణాలకు గాను ఒక కుటుంబానికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశారు. 2014లో 1,22,473 మంది రైతులకు రూ.894.71 కోట్లు రుణాలను మాఫీ చేసింది. 2018లో 21,090 మందికి రూ.49.65 కోట్లు మాఫీ అయింది.
వరి సాగు..
గత పాలకుల హయాంలో వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 25,982 ఎకరాల వరి సాగు జరిగేది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వానకాలంలో 1,25,456 ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. గతంలో యాసంగిలో 10,031 ఎకరాల్లో వరి సాగు జరిగితే, నేడు యాసింగిలో 90,447 ఎకరాలకు వరి సాగు పెరిగింది. నాడు వానకాలంలో 59,343 టన్నుల దిగుబడి వస్తే, నేడు 3,13,642 టన్నులకు దిగుబడి పెరిగింది. యాసంగిలో 23,074 టన్నుల దిగుబడి వస్తే, నేడు 2,35,162 టన్నులకు పెరిగింది.
యాంత్రీకరణ కోసం..
వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి సాగు ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా చిన్న, సన్న, ఇంకా పెద్ద రైతులకు 50% రాయితీతో వివిధ రకాల యంత్ర పరికరాలు సస్యరక్షణ పరికరాలు, వరి నాటు, ఇంకా వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లు అందజేసింది. ఈ పథకం కింద 21,675 మంది రైతులకు రూ.21 కోట్ల 8 లక్షల విలువైన వివిధ యంత్ర, సస్యరక్షణ పరికరాలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రాయితీపై అందజేయడం జరిగింది.
రైతు వేదికలు..
జిల్లాలో రైతులు సీజన్కు ముందు ఏ పంటలు వేయాలి? ఇంకా మార్కెటింగ్ వసతుల గురించి చర్చించుకోవడానికి వీలుగా 83 క్లస్టర్లలో 83 వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క వేదికకు రూ.22 లక్షల ఖర్చుతో నిర్మించడం జరిగింది. గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారుల కార్యాలయం రైతు వేదికలలోనే ఏర్పాటు చేయడం వల్ల వారు రైతులకు అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
విత్తన సరఫరా..
గతంలో రైతులకు సకాలంలో విత్తనాలు అందక సీజన్లో చాలా ఇబ్బందులు పడేవారు. కానీ, నేడు రైతులకు అన్ని రకాల విత్తనాలు వ్యవసాయ విస్తరణ అధికారి క్లస్టర్ల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్, రైతు సేవా సంఘాలు, డీసీఎంఎస్ల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటున్నాయి.
రైతుకు భరోసానిస్తున్నది
రైతుకు సకాలంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యపడింది. గత ప్రభుత్వాలు రైతుకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించలేని దాఖలాలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి క్యూలైన్లు కట్టి కొనుగోలు చేసి విత్తనాలు పెట్టేది. ప్రస్తుతం ఎరువులకు, విత్తనాలకు కొనుగోలు చేయడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుకు సకాలంలో సరిపడే విధంగా ఎరువులను, విత్తనాలను అందుబాటులో ఉంచడం చాలా సంతోషం. రెండు దఫాలుగా ఎకరాకు 10 వేలను ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం అందించడం హర్షణీయం. అలాగే రైతు ప్రమాద వశాత్తు మరణిస్తే రైతు కుటుంబానికి రైతుబీమా కింద రూ.5లక్షలను అందించి భరోసా నిస్తున్నది.
– నారేగూడెం బందిరెడ్డి, రైతు, నాగసాన్పల్లి, కోట్పల్లి మండలం
అందుబాటులో ఎరువులు, విత్తనాలు..
గత ప్రభుత్వ హయాంలో విత్తనాలు, ఎరువుల కోసం గంటలు, రోజుల తరబడి లైన్లో నిలబడేది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విత్తనాలు, ఎరువులు కొరతలేకుండా అనుకున్న చోట దొరుకుతున్నాయి. ప్రభుత్వం రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచినందుకు ప్రత్యేక ధన్యవాదములు.
– పి.గోపాల్ రైతు, రాజాపూర్ గ్రామం, ధారూరు మండలం
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం
సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారు. రైతుబీమా కింద జిల్లాలో 4,413 మంది రైతులు మరణించగా, వారి నామినీల ఖాతాల్లో మొత్తం రూ.220.65 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. రైతుల కోసం జిల్లా వ్యాప్తంగా 83 రైతు వేదికలను నిర్మించాం. గత పాలకుల హయాంలో వానకాలంలో సీజన్లో వరి సాగు 25 వేల ఎకరాల్లో జరిగితే, తెలంగాణ వచ్చాక వానకాలంలో లక్షా 25వేల ఎకరాలకు పైననే సాగు జరుగుతున్నది.
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, రంగారెడ్డి జిల్లా
రైతుల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు
సీఎం కేసీఆర్ పెట్టుబడులు, విత్తనాలు, ఎరువులు తదితర విషయాలను దృష్టిలో ఉంచుకొని ‘రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ’ లాంటివి ఎన్నో రైతులకు అందుబాటులోకి వచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు దోహదపడ్డాయి. రైతులకు 2018 నుంచి 2022 వరకు 10 సీజన్లకు గాను 3,04,617 మంది రైతులకు రూ.3017.91 కోట్లను వారి ఖాతాల్లో తెలంగాణ సర్కారు జమ చేసింది. ఇవే కాకుండా సబ్సిడీలో పలు రకాల వ్యవసాయ పనులకు ఉపయోగమైన ట్రాక్టర్లు, హార్వెస్టర్లను ప్రభుత్వం రైతులకు అందించింది.
– వంగేటి లక్ష్మారెడ్డి, రైతు బంధు చైర్మన్, రంగారెడ్డి జిల్లా