‘మహిళలు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారు.. ప్రతి రంగంలో 50 శాతం రిజర్వేషన్ కల్పించారు.. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం షీటీమ్స్ను ఏర్పాటు చేసింది.. మహిళల అభ్యున్నతికి కోసం సబ్సిడీ రుణాలతో పాటు పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ప్రతిభను చూపుతున్న మహిళలను మంత్రి సన్మానించి మాట్లాడారు. మగ బిడ్డలతో సమానంగా ఆడబిడ్డలను పెంచాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్లతో సీఎం కేసీఆర్ ఆడబిడ్డలను మేనమామలా ఆదుకుంటున్నారన్నారు.
బడంగ్పేట, మార్చి 8 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సీఎం కేసీఆర్ 50 శాతం రిజర్వేషన్లు కల్పించి పెద్దపీట వేస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రూపొందించిన స్టాల్స్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం చందన చెరువు కట్టపై మంత్రి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కళాకారులు పాడిన పాటలు, మహిళా కార్పొరేటర్ సౌందర్య పాడిన పాట పలువురిని ఆకట్టుకున్నాయి. కార్పొరేటర్లు లావణ్య, మాధవి తదితరులు కార్యక్రమం విజయవంతం కావడానికి చొరవ తీసుకున్నారని మంత్రి కొనియాడారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల నీటి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం మిషన్ భగీరథ నీటిని ప్రతి గడపకు అందించిందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి లోన్లు ఇచ్చి వ్యాపారం చేయడానికి చేయూతనిస్తున్నదని పేర్కొన్నారు. మహిళలు పారిశ్రామిక రంగం వైపు ఆడుగులు వేయడానికి సర్కారు వీలు కల్పించిందన్నారు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం షీటీమ్స్ను ఏర్పాటు చేసిందన్నారు. ఎక్కడైనా మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా క్షణాల్లో షీటీమ్స్ ఆకతాయిల ఆటలు కట్టిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. నేరాల అదుపునకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేదింటి ఆడపిల్లల వివాహానికి కల్యాణలక్షి, షాదీముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నదని తెలిపారు. ఆడబిడ్డ పుట్టినా సాయం అందుతున్నదని గుర్తు చేశారు.
లింగ భేదం లేకుండా పిల్లలను పెంచాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు విద్యాభ్యాసంలో సమాన అవకాశాలున్నాయన్నారు. రిజర్వేషన్లు కూడా కల్పించారన్నారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవంగా ఉండేలా మగపిల్లలను తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్, డీఈఈ గోపినాథ్, కార్పొరేటర్లు, వైద్యులు, పోలీసులు, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.