కొడంగల్, మే 30 : తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో కొడంగల్, దౌల్తాబాద్ మండల పరిధిలో, బొంరాస్పేట మండలంలో వేర్వేరుగా దశాబ్ది ఉత్సవాల నిర్వాహణపై సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని దశాబ్ది ఉత్సవాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాడు, నేడు ప్రగతికి సంబంధించి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను, సంక్షేమ ఫలాల వివ రాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని రంగాల్లో నేడు తెలంగాణ ప్రగతిని సాధించిందని, 2014కు ముందు 16 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంటే ప్రస్తుతం 56లక్షల ఎకరాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.
దేశం మొత్తంలో 56లక్షల ఎకరాలు వరి సాగు అవుతుంటే రాష్ట్రంలో 56లక్షల ఎకరాల్లో వరి సాగై దేశంలో 50 శాతం ఘనత సాధించినట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 70 శాతం పూర్తి అయ్యాయని, త్వరలో మన ప్రాంతంలో పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతంలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ మూడు న తెలంగాణ రైతు దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతు న్నాయని, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొం టారని తెలిపారు. రైతు దినోత్సవంలో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించాలని సూచించారు.
నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలోని రైతు వేదిక భవనాల్లో వేడుకను నిర్వహించి మధ్యాహ్నం మూడు గంటలకు పట్టణంలోని మార్కెట్ యార్డ్కు చేరుకోవాలని తెలిపారు. అదే రోజు మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం, రూ.50లక్షలతో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనం, బస్తీ దవాఖానల ప్రారంభోత్సవం, రూ. కోటి 50 లక్షలతో అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట ఎంపీపీలు ముద్దప్ప దేశ్ముఖ్, విజయ్కుమార్, హేమీబాయి, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డితో పాటు కోట్ల యాదగిరి, నారాయణరెడ్డి, టీటీ రాములు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇలాంటి సీఎంను చూడలేదు : మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి
ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి ఎందరో ముఖ్యమంత్రులను చూశాను కానీ కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి అన్నారు. సమావేశానికి విశిష్ట అథితిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టిన సీఎంగా పేర్కొన్నారు. ఏనాడూ ఎవ్వరూ కూడా ఊహించిన విధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళితబంధు, రైతు బంధు, రైతు బీమా వంటి అద్భుత పథకాలను అమలు చేసి అభివృద్ధి అంటే ఇది అని నిరూపించినట్లు తెలిపారు. కులవృత్తులు పూర్వ వైభవాన్ని సంతరించుకునే విధంగా సహకారాన్ని అందించి, అన్ని వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు తెలిపారు. ఇటువంటి సీఎం వెన్నంటి ఉండాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డపై ఉందన్నారు.