షాబాద్. మే 15 : ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు మందులు ఉచితంగా అందిస్తున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో మొత్తం 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో 11,309 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 453 మందికి కంటి అద్దాలు అందజేశారు. 463 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటు న్నారు. 42 కంటి వెలుగు శిబిరాల్లో వైద్య బృందాలు అప్పటి కప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లాలో 5,568 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 677 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 682 మందికి అద్దాల కోసం ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు 446 గ్రా మాలు, 84 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహిం చినట్లు అధికారులు తెలిపారు.