ఇదే ప్రశాంత రాజ్యం ఉండాల్నా.. మళ్లీ దళారీ రాజ్యం రావాల్నా.? మత పిచ్చి మంటలతోటి నెత్తురు పారాల్నా..? తెలంగాణ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం అభ్యర్థి జీవన్ రెడ్డి, ముథోల్ నియోజకవర్గం అభ్యర్థి విఠల్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గం అభ్యర్థి సంజయ్లకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. “జనమా.. ప్రభంజనమా..? ఈ సభలకు వచ్చిన ప్రజలను చూస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థులు 70-80 వేల మెజార్జీతో గెలవడం ఖాయమనిపిస్తున్నది.
కొందరు ఇప్పుడొచ్చి ఆపదమొక్కులు మొక్కుతారు.. అవన్నీ నమ్మకండి.. ప్రజల కోసం పనిచేసే.. నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడే వ్యక్తినే గెలిపించండి.” బీఆర్ఎస్ హయాంలో చెరువులన్నీ బాగుచేసుకున్నాం. వాగుల మీద చెక్డ్యాంలు కట్టుకున్నాం.. ఈ పని కాంగ్రెస్ ఎందుకు చేయలేదు. ఆనాడు చెప్పులు లైన్లో పెట్టి.. ఎరువులు, విత్తనాలు తీసుకున్న రోజులు మర్చిపోయారా.? మోడీ మోటర్లకు మీటర్లు పెట్టాలని ఆర్డర్ చేస్తే.. పెట్టమంటే.. రూ.25 వేల కోట్ల నష్టం చేసిండు.
దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. 50 ఉత్తరాలు రాసినా.. మనకు ఒక్కటి ఇవ్వలే.. పదేండ్ల నుంచి అడుగుతున్నాం.. 33 నవోదయ పాఠశాలలకు ఒక్కటీ ఇవ్వలే. ఇదేం వివక్ష.. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకొని మనల్ని ఓట్లు అడుగుతుంది.? వారికి బుద్ధి చెప్పాలి. భైంసా, ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్లో వందల ఏండ్ల నుంచి కలిసి బతుకుతున్నాం.
వారికి తాకులాటలు పెట్టి.. మతపిచ్చి లేపి.. భైంసా అంటేనే యుద్ధమన్నట్లు చిత్రీకరించారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినంక ఒక్క కర్ఫ్యూలేదు. ఇలానే ప్రశాంతంగా ఉండాల్నా.. మత పిచ్చి మంటలతోటి నెత్తురు పారాల్నా..? మీరే ఆలోచన చేయాలి. రైతుబంధు దండగ, 24 గంటల కరెంటు వద్దన్నోళ్లను బొందపెట్టాలి. మహారాష్ట్ర బార్డర్కు వెళితే.. రోడ్లు నున్నగాఉంటే తెలంగాణ.. గతుకులుగా ఉంటే మహారాష్ట్ర అని అక్కడి ప్రజలే తెలుపుతున్నారు.
మీ బిడ్డగా.. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నా.. ఓటు వేసే ముందు మంచి, చెడు, అభ్యర్థి గుణగణాలు తెలుసుకొని విచక్షణ జ్ఞానంతో ఓటు వేయాలి. లేదంటే వచ్చే ఐదేండ్లు బాధపడాలి. రెండుసార్లు రైతు రుణాలు మాఫీ చేసినం.. ఎన్నికలు అయిపోగానే పూర్తిగా మాఫీ చేస్తాం.. అని కేసీఆర్ అన్నారు.