రంగారెడ్డి, ఏప్రిల్ 11, (నమస్తే తెలంగాణ): తెలంగాణ వడ్లు కొనకుండా రైతుల పాలిట గండంగా మారిన కేంద్రంపై టీఆర్ఎస్ పోరు పతాక స్థాయికి చేరుకున్నది. సోమవారం ఢిల్లీలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన నిరసన దీక్షపై ప్రముఖులు, మేధావుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాతల పక్షాన ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఉద్యమించడం ఇదే తొలిసారి అని కొనియాడుతున్నారు. ఢిల్లీ దీక్షలో ఉమ్మడి జిల్లా నుంచి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, కొన్ని రోజులుగా గ్రామగ్రామాన ఆందోళనలు చేస్తున్నా బీజేపీ సర్కార్ పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ సరిపడా సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంట్, పెట్టుబడి సాయమందించి వ్యవసాయాన్ని పండుగలా మారిస్తే.. కేంద్రం మాత్రం పండించిన ధాన్యాన్ని కొనకుండా రైతులను నట్టేట ముంచుతున్నదని దుయ్యబట్టారు. వరి సాగు చేయాలని చెప్పిన రాష్ట్ర బీజేపీ నేతలు.. తీరా పంట చేతికి వచ్చే దశలో మొహం చాటేయడంపై మండిపడుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పోరాట స్ఫూర్తిని ప్రజలు మెచ్చుకుంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం గల్లీ నుంచి ఢిల్లీదాకా ఆందోళనలను చేయడాన్ని ప్రశంసిస్తున్నారు. నిరసన దీక్షలో స్వయంగా సీఎం కేసీఆర్ పాల్గొని మరోసారి రైతుల పక్షపాతిగా నిరూపించుకున్నారన్నారు. ఏదేమైనా కేంద్ర సర్కార్ ధాన్యాన్ని కొనాల్సిందేనని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించిన వడ్లు కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్తో తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీ వేదికగా రణ నినాదం చేసింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో గల్లీ నుంచి ఢిల్లీకి కదలివెళ్లిన గులాబీ దండు కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ఇప్పటి వరకు దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి రైతుల కోసం ఇలాంటి నిరసనదీక్ష చేయలేదన్నది సుస్పష్టం. తెలంగాణ ఏర్పాటు తర్వాత వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రపంచం మెచ్చిన పలు పథకాలు అమలు చేయడం వల్ల రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తున్నది.
మరోవైపు కరెంటు కోతలంటూ లేకుండా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను వ్యవసాయానికి అందించడంతో రైతుల మేలు కోరే ప్రభుత్వంగా నిలిచింది. గతంలో పంటలు సాగు చేస్తే కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. లో ఓల్టేజీతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతాంగానికి తీవ్ర నష్టం చేకూర్చాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ కరెంటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉత్పత్తిని పెంచడంతోపాటు సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచడం వల్ల లోఓల్టేజీ అంటూ లేకుండా కరెంటు సరఫరా అవుతున్నది. తద్వారా వరి సాగు విస్తీర్ణం ఐదారు సంవత్సరాల్లో అధికంగా పెరిగింది. పుష్కలంగా వర్షాలతో బోర్ల కింద సైతం రెండు పంటలు వరి సాగు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా వరి దిగుబడి సైతం పెరిగిందని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో కేంద్రం వడ్లు కొనుగోలు చేయబోమని చెప్పడం వల్ల రైతులు యాసంగిలో వరి సాగు చేయొద్దని స్వయంగా సీఎం కేసీఆర్ సూచించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టి మీరు వరి వేయండి కేంద్రంతో కొనిపిస్తామన్నారు. తీరా పంట చేతికి వచ్చే దశలో బీజేపీ నాయకులు మొహం చాటేశారు. మరోవైపు పక్కా వ్యాపారిలా నూకలు అధికంగా అయితే నష్టం వస్తుందని, మీ ప్రజలతో నూకలు తినిపించండంటూ కేంద్ర మంత్రి పీయూష్గోయల్ అవహేళన చేయడం రైతాంగానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి ఆందోళనలు నిర్వహించింది.
చివరకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో సోమవారం ఢిల్లీలో నిరసనదీక్ష చేపట్టింది. ఈ నిరసనదీక్షకు వికారాబాద్ జిల్లా నుంచి జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, పైలెట్ రోహిత్రెడ్డి, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఢిల్లీలో చేపట్టిన నిరసనదీక్షలో రైతు సంఘం జాతీయ నాయకుడు రాకేష్ టికాయత్ పాల్గొని సంఘీభావం తెలుపడం వల్ల తెలంగాణ రైతాంగం కష్టాలు జాతీయ స్థాయిలో కదిలించాయి. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాల్సిందేనని రాకేష్ టికాయత్ సైతం డిమాండ్ చేశారు. మరోవైపు వడ్లు కొనుగోలు విషయంలో బీజేపీ నాయకులు, ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా ఎండగట్టారు.
వడ్లు కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాగల 24 గంటల్లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ డెడ్లైన్ విధించారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వమే ఆందోళనకు దిగడం రైతాంగంపై టీఆర్ఎస్కు గల నిబద్దతకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. తమ తరఫున ఢిల్లీలో సైతం టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టడం వల్ల మరోసారి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని తేలిందని రైతులు, రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
వన్ నేషన్, వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాల్సిందేనని పలువురు పేర్కొంటున్నారు. వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరి దేశ ప్రజలకు తెలిసిపోయిందని, దేశంలోని రైతాంగం ముందు బీజేపీ దోషిలా నిలబడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో బీజేపీకి నూకలు చెల్లినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ధాన్యం కొనేవరకూ పోరాటం ఆగదు
రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయాలని కేంద్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. సోమవారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డితోపాటు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్తోపాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
అయితే ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ రహదారులపై రాస్తారోకో, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, గ్రామగ్రామన రైతులతోపాటు టీఆర్ఎస్ నేతల ఇండ్లపై నల్ల జెండాలతో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అయితే కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న జిల్లా రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు బిజెపికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వరకూ పోరాటం ఆపేదిలేదన్నారు. పంజాబ్, హర్యానా తరహాలో తెలంగాణలోనూ రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం తెలంగాణపై కక్ష సాధిస్తున్నది..
తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేక కక్ష సాధిస్తున్నది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అమలు చేయడం సరికాదు. బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనకుండా రైతుల మనోభావాలతో చెలగాటమాడుతున్నది. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు. రాష్ట్ర బీజేపీ నాయకులకు కేంద్రానికి ఎందుకు చెప్పరు. సీఎం కేసీఆర్ వెంటే మేమంతా ఉంటాం.
– నీరటి శేఖర్, బానాపూర్, యాలాల మండలం
యాసంగి ధాన్యం కేంద్రమే కొనాలి..
యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతాం. వారం రోజులుగా నిరసనలు చేపట్టినా.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీక్ష చేసినా కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం దారుణం. ఇతర రాష్ర్టాల్లో మాదిరిగానే వరి ధాన్యాన్ని కొనాలి.
– పోన్న స్వప్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, షాబాద్