పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కల్వకుర్తి నియోజకవర్గంలో 1.50లక్షల ఎకరాలకు కృష్ణా నీరందించే బాధ్యత తనదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా ఆదివారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరై ప్రసంగించారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు పుట్టెడు కష్టాలు పడ్డారన్నారు.
కరెంట్, సాగునీరు లేక, పంటలు పండక పాలమూరు ప్రజలు వలసలు వెళ్లారన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత రోజులు వస్తాయని, ధరణిని తీసేస్తే దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుందన్నారు. రైతుబంధు నిలిచిపోతుందని, ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను మరోసారి గెలిపిస్తే ఆయన అడిగినన్ని పనులను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
-కల్వకుర్తి, నవంబర్ 19
కల్వకుర్తి, నవంబర్ 19 : బీఆర్ఎస్కు ఓటేసి జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే కల్వకుర్తి నియోజకవర్గానికి పాలమూరు- రంగారెడ్డి ఎతిక్తపోతల పథకం ద్వారా 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. మహాత్మాగాంధీ, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గానికి దాదాపు 90 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా ఆదివారం సాయంత్రం కల్వకుర్తిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పరిపాలన కాలంలో కల్వకుర్తి నియోజకవర్గ బిడ్డలు పడ్డ కష్టాలను ముఖ్యమంత్రి మరోసారి గుర్తుకు తీసుకొచ్చారు.
కరెంట్, సాగునీరు లేక వ్యవసాయం లేక.. బతకనీకి సౌలతులు లేక వలసలు పాలయ్యారని, పట్టణాలకు తరలిపోయి లంబాడీ బిడ్డలు ఆటోలు తోలుకుంటూ పడ్డ కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు, పేదల సంక్షేమంతో పాటు పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చామన్నారు. ప్రజలు కడుతున్న పన్నులను తీసుకుపోయి కేసీఆర్ రైతులకు రైతుబంధు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులు డైరెక్ట్గా మాట్లాడుతున్నారని, రైతుబంధు వేస్ట్ అని కాంగ్రెసోళ్లు అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. జైపాల్యాదవ్ను గెలిపిస్తే రైతు బంధును ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతామన్నారు. కరెంట్ 24 గంటలు అవసరం లేదని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ అంటున్నారని, మేము అధికారంలో వస్తే 3 గంటలు కరెంట్ ఇస్తామని చెబుతున్నారని, ఎట్ల సరిపోతదయా అంటే 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాని సెలవిస్తున్నాడు ఆ బుద్ధిమంతుడని విమర్శించారు. కరెంట్ 24 గంటలు ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా గెలువాల్సిన అవసరం ఉందన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే చాలా కమిటేడ్గా పని చేస్తున్నారు.
ప్రభుత్వంపై, నాపై ఒత్తిడి తీసుకువచ్చి కల్వకుర్తి నియోజకవర్గానికి 90 వేల ఎకరాలకు సాగునీరు పారేలా చేసుకున్నాడు. 50 ఏండ్ల పరిపాలనలో కష్టాలకు గురిచేసిన కాంగ్రెస్ రూ.200 పింఛన్ మన మొఖాన కొట్టింది. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది, ఉద్యమం చేస్తే కాల్చి చంపింది. కల్వకుర్తి సమీపం నుంచి రింగ్ రోడ్ వస్తుంది, ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది. బట్టి విక్రమార్క చెబుతున్నాడు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తారట. ధరణిని తీసేస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి. బ్రోకర్లు పెరుగుతారు. రైతు బంధు నిలిచిపోతుంది. ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తామంటున్న కాంగ్రెస్ ఓటు వేస్తే బతుకులు ఆగమైపోతాయి, పైరవీకారులు పెరుగుతారు, ఆలోచించుకోండి.
మీటింగ్ ముగిసిన తర్వాత ఊర్లకు పోయి చర్చ పెట్టుకొండి. జాగ్రతగా ఆలోచించుకుని ఓటు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను గెలిపిస్తే అడిగిన పనులన్నింటినీ చేస్తానని హామీ ఇచ్చారు. ఆమనగల్లులో రెవెన్యూ డివిజన్, ఏసీపీ, ఎంవీఐ, కల్వకుర్తిలో ఇంజినీరింగ్ కళాశాలతోపాటు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జైపాల్యాదవ్ బీసీ బిడ్డ.. సీట్లు ఇవ్వని చోట ఇవ్వకలేకపోయాం. ఇచ్చిన చోట బీసీ ఐక్యత ప్రదర్శించాలి. బీసీ బిడ్డ జైపాల్యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, బీఆర్ఎస్ నాయకులు బొంతు రామ్మోహన్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వెంకటేశ్, మున్సిపల్ చైర్మన్ సత్యం పాల్గొన్నారు.