ధారూరు, ఫిబ్రవరి 21 : మన ఊరు-మన బడి, డబుల్ బెడ్రూమ్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్రేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి కింద మొదటి విడుతలో రూ.30 లక్షల లోపు చేపట్టే పనులను, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను మార్చి 31లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను కూడా నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను అంకితభావంతో పనిచేసి ప్రజలకు అందేలా చూడాలని ఆయన తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో, శాఖల సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ముందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. అధికారులు నిబద్ధతతో పని చేసినైట్లెతే జిల్లా యంత్రాంగం పూర్తి సహకారాన్ని అందిస్తుందని నారాయణరెడ్డి తెలిపారు.
ప్రణాళికాబద్దంగా.. సమన్వయంతో పనులు చేయాలి
కాంట్రాక్టర్స్ నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ వంద శాతం పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పనులు చేపట్టేందుకు ఇప్పుడున్న సమయం అనుకూలంగా ఉంటుందని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని మే నెలాఖరు లోపు పనులు పూర్తి చేయాలని తెలిపారు. ప్రణాళికాబద్దంగా.. సమన్వయంతో కాలానుగుణంగా పనులు చేయాలని సూచించారు. వివిధ దశల్లో ఉన్న రోడ్లు భవనాల నిర్మాణాల పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. మండలస్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పనుల పురోగతి సమాచారాన్ని అందించేలా చూడాలని తెలిపారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, డీఎంహెచ్వో పాల్వన్కుమార్, ఇంజినీరింగ్ విభాగాల డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.