మొయినాబాద్, అక్టోబర్ 13 : విద్యార్థులు విద్యతోపాటు క్రీడా రంగంలోనూ రాణించినవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రెటరీ పార్వతీదేవి అన్నారు. చిలుకూరు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/కళాశాల ప్రాంగణంలో 6బీ జోనల్ ప్రాంతీయ స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం అంగరంగవైభవంగా ప్రారంభించారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 11 పాఠశాలల నుంచి క్రీడాకారులు 995 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి, జాతీయ పతాకాన్ని, గురుకుల విద్యా సంస్థ పతాకాన్ని, స్పోర్ట్స్ పతాకాన్ని ఆవిష్కరించి గాలిలోకి బెలూన్స్ వదిలి క్రీడను ప్రారంభించారు. క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ చేసి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు, అతిథులకు గౌరవ వందనం చేశారు. అనంతం వాలీబాల్ పోటీలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లా పశ్చిమ ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్ శారదావెంకటేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఏదో ఒక క్రీడపై ఆసక్తి పెంచుకొని శ్రద్ధతో పాల్గొంటే ఆ క్రీడలో రాణించగలుగుతారని పేర్కొన్నారు. క్రీడల్లో పోటీతత్వంతో పాల్గొనాలని సూచించారు. నేటి ఓటమి భవిష్యత్తులో గెలుపుపకు నాందిలాంటిదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను ఎంతో బలోపేతం చేసిందని చెప్పారు. గురుకుల విద్యాలయాల్లో సీటు పొందాలి అంటే నవోదయ పాఠశాలల తరహాలో తీవ్ర పోటీ ఉందని చెప్పారు. గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్యతోపాటు, క్రీడా రంగాల్లో రాణిస్తూ మంచి క్రమశిక్షణ గల విద్యార్థిగా తీర్చిదిద్దబడుతున్నారని పేర్కొన్నారు.
జోనల్ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి గెలుపొందిన క్రీడాకారులు ఇంటర్ గురుకులాల క్రీడా పోటీల్లో పాల్గొనడంతోపాటు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత పొందుతారని చెప్పారు. క్రీడల్లో విద్యార్థులు ప్రతిభను కనబర్చితే చాలు.. వారు పాల్గొనడానికి కావాల్సిన ఖర్చులు గురుకుల విద్యా సంస్థ భరిస్తుందని, విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే గురుకుల విద్యా సంస్థ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ మోహన్శంకర్, ఫిజికల్ డైరెక్టర్ ఆదిబాబు, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, పీఈడీలు, పీఈటీలు పాల్గొన్నారు.