చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాల్లో విజయం సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ బీసీ అస్ర్తాన్ని సంధించింది. అధికార కాంగ్రెస్ ఓసీలకు టికెట్లు కేటాయించగా.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం బడుగు, బలహీన వర్గాల నేతలైన కాసాని జ్ఞానేశ్వర్, క్యామ మల్లేశ్లను బరిలో నిలిపింది. బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆ వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకతీతంగా బీసీలందరూ ఏకమవ్వాలన్న చర్చ జోరందుకున్నది..
రంగారెడ్డి, మార్చి 31(నమస్తే తెలంగాణ) : జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కొత్త అస్ర్తాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్, బీజేపీలను ఇరుకున పెట్టేలా చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాల నుంచి బీసీ అభ్యర్థులను రంగంలోకి దిం పింది. అత్యధిక శాతం బీసీ ఓటర్లు ఉన్న ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థులను బరిలో నిలపడం బీఆర్ఎస్కు అనుకూలించే అంశంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రెండు చోట్లా..ఒకట్రెండు సామాజిక వర్గాల లీడర్లే ఎంపీలుగా ఉంటూ వస్తుండడంతో.. బీసీలను గెలిపించుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీలకతీతం గా ఏకమవ్వాలన్న చర్చ సైతం జోరందుకున్నది.
బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పే కాంగ్రెస్, బీజేపీలు ఆచరణలో మాత్రం అం దుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. చేవెళ్ల లోక్సభ బరిలో కాంగ్రెస్ పార్టీ రంజిత్రెడ్డి(ఓసీ)ని పోటీలో నిలపగా.. బీజేపీ సైతం తమ అభ్యర్థిగా విశ్వేశ్వర్రెడ్డి(ఓసీ)ని రంగంలోకి దింపింది. జనరల్ రిజర్వ్డ్ సీటు అయిన చేవెళ్ల లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముదిరాజ్ వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇక భువనగిరి లోక్సభ స్థానానికి బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్(బీసీ) పోటీ పడుతున్నారు.
బీఆర్ఎస్ సైతం బీసీ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపి గొల్ల,కురుమ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్ను బరిలో నిలిపింది. బీసీ అభ్యర్థినే నిలపాలన్న నినాదం తెరపైకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దానిని పట్టించుకోకుండా చామ ల కిరణ్కుమార్రెడ్డి(ఓసీ)ని అక్కడి నుంచి పోటీ చేయిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణ యం స్థానిక బీసీల్లో అసంతృప్తిని రాజేస్తున్నది. జనరల్ స్థానాలు అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలిపి ప్రాధాన్యత కల్పించడం పట్ల బీసీ వర్గాలు సంతోషంగా ఉన్నాయి.
చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ ఓటర్లు బీసీలే ఉన్నారు. రెండు చోట్లా బీసీ ఓటర్లే కీలకంగా ఉన్నప్పటికీ ఒకట్రెండు సామాజిక వర్గాల నాయకులే ఎన్నికవుతూ వస్తున్నారు. ఏండ్ల తరబడిగా బీసీలకు రాజకీయ ప్రాధా న్యం దక్కడం లేదన్న అసంతృప్తి రెండు ఎంపీ స్థానాల్లోనూ ఉన్నది. రాజకీయ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయన్న ఆవేదనను సైతం బీసీ లు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
అయితే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసి ఆ వర్గాలకు చెందిన అభ్యర్థులను ఎంపీలుగా నిలబెట్టడడంతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా బీసీలను గెలిపించుకోవాలన్న ఆలోచనలో బీసీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో పార్టీలకతీతంగా బీసీలందరూ ఏకమవ్వాలన్న చర్చ సైతం అంతర్గతంగా జరుగుతున్న ట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కాసాని జ్ఞానేశ్వర్, క్యామ మల్లేశ్లు తమ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కాకుండా ఇతర వర్గాలకు చెందిన ప్రజల నుంచి కూడా అనూహ్యంగా మద్దతు లభిస్తున్నది.
తమ సామాజిక వర్గానికి చెందిన కులాల మద్దతును కూడగట్టేందుకు ఇరువురు ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమాలోచనలు చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకున్న బీసీ నినాదం రిజల్ట్లో కచ్చితంగా మార్పులు తీసుకొస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.