మొయినాబాద్, మార్చి 25 : బంగారు తెలంగాణలో ప్రతి పల్లె బాగుపడిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 19 గ్రామ పంచాయతీలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార అవార్డులకు ఎంపికయ్యాయి. శనివారం ఆ గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీఈసీలు, పంచాయతీ కార్యదర్శులకు ఎంపీపీ నక్షత్రం, వైస్ ఎంపీపీ మమత, ఎంపీడీవో సంధ్యలతో కలిసి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను బాగు చేయడానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి ఇంటికీ తిరిగి చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేసి, చెత్త సేకరణ చేయడంతో పల్లెలు పరిశుభ్రంగా ఉన్నాయని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
మండలంలోని 108 మందికి రూ.1.8 కోట్ల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ..సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేసి ఆర్థికసాయాన్ని అందజేసిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఎంపీడీవో సంధ్య, తహసీల్దార్ అశోక్, డీటీ వినయ్సాగర్, సర్పంచ్లు మంజూల, లావణ్య, రవళి, వినిత, స్వరూప, రాఘవరెడ్డి, రత్నం, నవనీత, సంధ్య, ప్రవీణ్, సుకన్య, మాణెమ్మ, శ్రీనివాస్, సత్తమ్మ, ఎంపీటీసీలు ప్రభావతి, సుజాత, సుమలత, మల్లేశ్, రాంరెడ్డి, లత, రవీందర్, కోఆప్షన్ సభ్యుడు బిలాల్, పంచాయతీ కార్యదర్శులు తదితలలు పాల్గొన్నారు.