చేవెళ్ల రూరల్, జూన్ 7 : గతంలో సాగు నీరు లేక సాగు సాగిలపడిందని.. నేడు సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం జలకళను సంతరించుకున్నదని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేవెళ్ల మండల పరిధిలోని దేవునిఎర్రవల్లి గ్రామ సమీపంలోని శ్రీవెంకశ్వర ఫంక్షన్ హాల్లో బుధవారం తెలంగాణ సాగు నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారని అన్నారు. గతానికి.. ప్రస్తుతానికి చాలా వ్యత్యాసం ఉన్నదని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం అని, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ పనులతో భూగర్భ జలాల నీటి మట్టం పెరిగి నేడు పంటలు అధికంగా పండుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
నాడు రైతుల కంట నీరు.. నేడు రైతుల పంటపొలాల్లో పుష్కలంగా నీరు లభిస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాల ఏర్పాటుతో సాగు, తాగు నీటి ఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గవ్యాప్తంగా 218 చెరువులు ఉన్నాయని, మిషన్ కాకతీయ ఫేజ్-1లో 35 చెరువులు రూ.346.60 లక్షల ఖర్చు, ఫేజ్-2లో 39 చెరువులు రూ.14.81.17 లక్షలు, ఫేజ్-3లో 18 చెరువులు రూ.369.59 లక్షలు, ఫేజ్-4లో 16 చెరువులు రూ.174.49 లక్షలు, మొత్తం 108 చెరువులు రూ.2371.32 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. దీంతో నియోజకవర్గ పరిధిలో భూగర్భ జలాల మట్టం ప్రతి ఏడాది 1.5 మీటర్ల చొప్పున పెరుగుతూ వస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో రూ.1117.50 లక్షలతో నియోజకవర్గ పరిధిలో కొత్తగా 5 చెక్డ్యాంలు నిర్మించామన్నారు. కాళేశ్వరం లాగే పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతున్నదని, ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలువాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, సర్పంచ్లు మాణిక్యరెడ్డి, సురేందర్, ఆర్డీవో వేణుమాధవ్రావు, ఎంపీడీవో రాజ్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ రాజశేఖర్, సంబంధిత శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి, అంగన్వాడీ టీచర్లు పాల్గొనారు.