రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం పోటెత్తారు. అశేష జనవాహినితో రెండు సభల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ప్రాంగణాల బయట, రోడ్లపై నుంచే సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. పార్టీ శ్రేణుల ఈలలు, కేకలు, జై కేసీఆర్.. జైజై బీఆర్ఎస్.. కారుగుర్తుకే మన ఓటు.. అన్న నినాదాలు ఇరు సభల్లో దద్దరిల్లాయి.
గులాబీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో దారులన్నీ గులాబీ మయమయ్యాయి. పార్టీ శ్రేణుల నృత్యాలతో నూతనోత్సాహం నెలకొన్నది. జాతరలా తరలివచ్చిన జనంతో పండుగ వాతావరణం నెలకొన్నది. రెండు సభల్లోనూ కళాకారుల ఆటపాటలు సభికులను ఉర్రూతలూగించాయి.