కొడంగల్, అక్టోబర్ 18 : తెలంగాణ-కర్నాటక బార్డర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో కట్టుదిట్టమైన నిఘా చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. ముందుగా కలెక్టర్తోపాటు ఎస్పీ కోటిరెడ్డి కలిసి చెక్పోస్టులను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలోని హైవే 163 రహదారిపై రాష్ట్ర సరిహద్దు చంద్రకల్ చెక్పోస్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం, డ్రగ్స్, డబ్బుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెక్పోస్టులో అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. పటిష్టమైన నిఘా కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. సిబ్బందితో నేరుగా మాట్లాడి చేపడుతున్న విధులను తెలుసుకున్నారు. ఇప్పటివరకు రూ.8లక్షల 26వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
నియమ నిబంధనలు పాటించాలి
రాజకీయ నాయకులతో పాటు ప్రజలు, అధికారులు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన పెంచుకొని, కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. రూ.50వేల లోపే వెంట తీసుకెళ్లే ఆస్కారముంటుందని, ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లాల్సి వస్తే నగదుకు సంబంధించి పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. సరైన వివరాలు లేకపోతే నగదు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల అనంతరం పూర్తి వివరాలను చూపించి నగదును తీసుకోవాలని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని 275 పోలింగ్ కేంద్రాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా పకడ్బందీ చర్యలు తీసుసుకున్నట్లు పేర్కొన్నారు. ఈవీఎంలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 2లక్షల30వేల మంది ఓటర్లు ఉన్నారని, 18 సంవత్సరాలు నిండిన వారికి కొత్తగా ఓటరు నమోదు చేసుకోవడానికి ఈ నెల చివరి వరకు అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. యువత పూర్తి అవగాహనతో ఓటరు నమోదు చేసుకొని ఓటు హక్కును పొందాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై చాలా సీరియస్గా ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
పూర్తి భద్రతా చర్యలు
ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో 15 చెక్పోస్టులను ఏర్పాటు చేసి పూర్తి భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఎటుంటి భయభ్రాంతులకు లోనుకాకుండా ఉండేలా అవగాహన కల్పించామన్నారు. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు రూ.75లక్షల వరకు నగదును, 1300 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. బైండోవర్, వెపన్స్ డిపాజిట్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీఎస్పీ కరుణాసాగర్రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, ఎంపీడీవో పాండుతోపాటు ఎస్ఐలు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.