షాబాద్, డిసెంబర్ 13 : రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిలో తీసుకున్న చర్యలతో స్వచ్ఛ కాలనీలు, బస్తీలుగా మారాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డిజిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, భగత్సింగ్నగర్, క్రాంతినగర్, ఉర్దూ మీడియం స్కూల్ వద్ద, వెంకటేశ్వరకాలనీ రోడ్డు నంబర్-3, భగత్సింగ్నగర్ ఫేజ్-2 కాలనీల్లో రూ. 85లక్షలతో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణలోని పట్టణాలకు మహర్దశ కలిగిందని చెప్పారు. శివార్లలో పెరుగుతున్న కాలనీలకు రక్షిత తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ ద్వారా రూ.1200 కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖలో పూర్తి అవగాహనతో ప్రణాళికమైన అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. పట్టణ ప్రగతితో గతంలో కన్నా సీజనల్ వ్యాధులు తగ్గిపోయినట్లు తెలిపారు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, నూతన లైన్ల కోసం రూ.3500 కోట్లు సీఎం మంజూరూ చేశారని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.