తాండూరు, డిసెంబర్ 22 : దేశంలో సగానికిపైగా ఉన్న బీసీ వర్గాలకు కేంద్రం కనీసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడంతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ వర్గం నుంచి ప్రధానిగా ఉన్న మోదీ బీసీలకు కేవలం రూ.900 కోట్ల బడ్జెట్ను మాత్రమే కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సామాజిక ఆర్థిక కుల గణన 2011 కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్లు ఖర్చుపెటినా ఇప్పటి వరకు వివరాలు ప్రకటించలేదని విమర్శించారు.
ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినా.. నియమ నిబంధనలు నిర్ణయించకపోవడంతో ఆ కమిటీ ఏమి తేల్చలేకపోయిందన్నారు. సుప్రీంకోర్టు, మండల్ కమిషన్ చెప్పినా కుల గణన చేయడంలో కేంద్రానికి ఉన్న అడ్డంకులు ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక వైఖరిని దేశానికి తెలిసేలా ఎండగడుతామన్నారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయకపోతే, కులగణన చేపట్టకపోతే ఇక నుంచి బీసీల ‘ధర్మ పోరాటం’ ఉధృతంగా మారుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన కులాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని కృష్ణమోహన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఉపేందర్, కిశోర్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్ ఉన్నారు.