వికారాబాద్, మే 6: జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయడమే లక్ష్యమని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలోని జిల్లా కమ్యూనిటీ పోలీసింగ్ సీసీటీవీల పెంపు, వాటి నిర్వహణ తదితర అంశాలపై ఆయన పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు జరిగేలా చూడాలన్నారు. వాటిని గ్రామం నుంచి తమ పరిధిలోని పోలీస్స్టేషన్కు..అక్కడి నుంచి జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలన్నారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలోని రాష్ట్ర కమాండ్, కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల శ్రేయస్సు కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామాల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో జరుగుతున్న పలు విషయాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.