ఇబ్రహీంపట్నం రూరల్, మే 30 : వానాకాలం సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతుల డిమాండ్ మేరకు సాగు విస్తీర్ణం ఆధారంగా ఏయే పంట విత్తనాలు ఎంత అవసరమో గుర్తించి వారికి అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యంగా వ్యవసా య, పోలీసు శాఖ ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువుల విక్రయా లపై ప్రత్యేక దృష్టి సారించారు. నాసిరకం విత్తనాల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నిషేధించిన విత్తనాలను విక్రయిస్తే..
ప్రభుత్వం నిషేధించిన విత్తనాలను విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ప్రభుత్వ గుర్తింపులేని విత్తనాలను విక్రయిస్తే విత్తన డీలర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నారు. పంటలు సాగు చేసుకునే రైతులు పొలాల్లో విత్తే విత్తనాలు గుర్తింపు పొందిన కంపెనీలకు చెందినవే వాడాలని వ్యవసాయాధికారులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. విత్తనాల ఎంపికపై రైతులకు అవగాహన ఉండాలని పేర్కొంటున్నారు. ఫర్టిలైజర్ దుకాణాలను ఆశ్రయించి కల్తీ విత్తనాలు విక్రయిస్తే మోసపోకుండా వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి అధిక దిగుబడులు సాధించాలని అధికారులు కోరుతున్నారు. ఎక్కడైనా ఫర్టిలైజర్ దుకాణ యజమానులు కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ తెలిపారు. రైతులు విత్తనాలను కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా పరిశీలించి అవి నాణ్యమైనవా, కల్తీ యా అని పరిశీలించి కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ ఆద్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏడీఏ సత్యనారాయణ ఆధర్యంలో విత్తనాల కొనుగోలు సమయంలో తీసుకో వాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
నోటిఫైడ్, నాన్నోటిఫైడ్ విత్తనాల్లో తేడా..
విత్తనాల్లో ప్రభుత్వ పరంగా విడుదలయ్యేవి. ప్రైవేటు పరంగా విడుదలయ్యేవి ఉంటాయి. ప్రభుత్వ పరంగా రూపొందించిన రకాలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నోటిఫైడ్ పేరిట మార్కెట్లోకి వస్తాయి. ప్రైవేటు సంస్థలు రూపొందించిన విత్తనాలను నాన్నోటిఫైడ్ పేరిట మార్కెట్లోకి విడుదల చేస్తాయి. నోటిఫైడ్ విత్తనాల నాణ్యత, పంపిణీ ప్రమాణాలు, 1966నాటి విత్తన చట్టం పరిధిలోకి వస్తాయి. నోటిఫైడ్ విత్తనాలు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే ఉత్పత్తిదారులు, పంపిణీదారులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు.
సలహాలు, సూచనలు తప్పనిసరి
విత్తనాలు కొనుగోలు చేసే ముందు రైతులు సమీపంలోని వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలి. విత్తనాలు మేలు రకమా, నాసిరకమా అనేది చూసుకోవాలి. నాసిరకం విత్తనాలను వ్యాపారులు, రైతులకు అంటగడితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఎక్కడైనా కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా దుకాణాల్లో విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు.
– సత్యనారాయణ, ఏడీఏ, ఇబ్రహీంపట్నం
విత్తనాల నాణ్యతను పరిశీలించాలి..
ఇలాంటి విత్తనాలు కొనుగోలు చేయొద్దు..
విత్తన సంచులపై ఉండే వివరాలు..